AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవేట.. గుహలో నక్కిన టెర్రరిస్టులు హతం..!

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులను నిర్మూలించడానికి భారత సైన్యం నిరంతర ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే జమ్ము కశ్మీర్‌లో రెండు ఎన్‌కౌంటర్లలో ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతమయ్యారు. ఉద్దంపూర్‌ అటవీప్రాంతంలో గుహలో నక్కిన టెర్రరిస్టులను అంతం చేశాయి భద్రతా బలగాలు. కిష్ట్తార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో జైషే ఉగ్రవాది హతమయ్యాడు.

జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవేట.. గుహలో నక్కిన టెర్రరిస్టులు హతం..!
Operation Trashi I
Balaraju Goud
|

Updated on: Feb 04, 2026 | 9:45 PM

Share

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. ఉద్దంపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉద్దంపూర్‌ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారంతో గత రెండు రోజుల నుంచి భద్రతా బలగాలు కూంబింగ్‌ను చేపట్టాయి. నలుగురు ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో ఆశ్రయం తీసుకున్నట్టు సమాచారం అందింది. పారిపోయిన ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది.

రాంపూర్‌ అటవీప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఆర్మీ , సీఆర్‌పీఎఫ్ బలగాలతో పాటు జమ్ముకశ్మీర్‌ పోలీసులు ఉగ్రవాదుల కోసం కూంబింగ్‌ చేపట్టారు. ఎన్‌కౌంటర్‌లో హతమైన ఇద్దరు ఉగ్రవాదులను పాకిస్తాన్‌కు చెందినవాళ్లుగా గుర్తించారు. జైష్-ఎ-మొహమ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు ఓ గుహలో తలదాచుకోవడం తీవ్ర కలకలం రేపింది.

అయితే పక్కా సమాచారం అందుకున్న బలగాలు ఎన్‌కౌంటర్‌లో వాళ్లను హతమార్చి ఆపరేషన్‌ పూర్తి చేశాయి. భద్రతా దళాలు ప్రాంతాన్ని పూర్తిగా ముట్టడి చేసి, స్థానిక ప్రజలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. ఉగ్రవాదులు గుహలో దాక్కోవడంతో.. ఆపరేషన్ క్లిష్టంగా మారినా, సైన్యం వ్యూహాత్మకంగా ముందుకు సాగి వారిని అంతం చేసింది. ఈ ఆపరేషన్‌లో గుహ నుంచి రైఫిళ్లు, పేలుడు పదార్థాలు, ఇతర ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

మరికొందరు ఉగ్రవాదులు దాక్కున్నారా? అనే అనుమానంతో గాలింప చర్యలను ముమ్మరం చేశాయి. ఉధంపూర్ జిల్లా బసంత్‌గఢ్, మజల్టా ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు కాల్పులు జరిగాయి. అయితే ఉగ్రవాదులు ఆ కాల్పుల నుంచి తప్పించుకున్నారు. మరోవైపు కిష్ట్తార్‌లో జరిగన ఎన్‌కౌంటర్‌ జైషే ఉగ్రవాది హతమయ్యాడు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..