ఈ క్రమంలో బైడెన్(Joe Biden), మోదీ(PM Modi)ల వర్చువల్ భేటీ, ఇండియా, అమెరికా దేశాల మంత్రిత్వ స్థాయి చర్చలు (2+2 భేటీగా పిలుస్తున్నారు) కీలకంగా కనిపించాయి. ఈ భేటీల్లో అమెరికా.. భారత్పై ఒత్తిడి తేవడం ఖాయమని అందరు అనుకున్నారు. కానీ పరిస్థితి తలకిందులైంది. ఇండియన్ ఫారిన్ పాలసీని ప్రశ్నించలేమని బైడెన్ తరపున వైట్ హౌజ్ ప్రకటించింది. కేవలం ప్రకటించడమే కాదు.. ఉక్రెయిన్, రష్యాల విషయంలో ఇండియా విధానాన్ని పరోక్షంగా సమర్థించింది కూడా. ఉక్రెయిన్కు మానవీయ కోణంలో సాయమందిస్తున్న ఇండియాను వైట్ హౌజ్ ప్రతినిధి కొనియాడారు. ఓసమయంలో వైట్ హౌజ్ ప్రతినిధి.. ఇండియన్ రాయభారా అన్న సందేహం వచ్చేలా ఆయన మాట్లాడారు. ఇదంతా ఎలా సాధ్యమైంది? ఫిబ్రవరి 24 యుద్దం ప్రారంభమైనపుడు ఇండియా తటస్థ విధానానికి భిన్నంగా మాట్లాడిన చాలా దేశాలు.. ఇపుడు ఇండియన్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇండోనేషియా, సింగపూర్, థాయ్ లాండ్, ఫిలిఫ్పైన్స్, కాంబోడియా, వియత్నాం, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలతోపాటు పలు గల్ఫ్ దేశాలు భారత తటస్థ విధానాన్ని అనుసరించడం మొదలు పెట్టాయి. ఇదిలా కొనసాగుతుండగానే అనూహ్యంగా అమెరికా, యుకె వంటి దేశాలు భారత విధానాన్ని పరోక్షంగా హైలైట్ చేయడం ప్రారంభించాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో ఆంక్షలు విధిస్తామన్న అమెరికా.. ఇండియాను ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో చూడాలనుకుంటున్నామంటూ మరోసారి ప్రకటించి అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. అదేసమయంలో ఇండియాతో కలిసి నేవీ విన్యాసాలను కొనసాగిస్తామని తెలిపింది. భారత నౌకాశ్రయాలను ఇకపై అమెరికన్ యుద్ద నౌకలు తరచూ సందర్శిస్తాయని కూడా ప్రకటించింది. ఇది రెండు దేశాల మధ్య రక్షణ రంగ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే.. భారత దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ అమెరికా సన్నాయి నొక్కులు నొక్కడం మాత్రం కాస్త ఆందోళన కలిగించే పరిణామమే. అమెరికాతో జరిగిన చర్చల్లో భారత వాణిని బలంగాను, ప్రబలంగాను వినిపించిన విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రొఫెసర్ జయశంకర్ ఇపుడు అందరి ప్రశంసలు పొందుతున్నారు. పలు సంస్థల అధినేతలు జయశంకర్ వాగ్ధాటిని, మన దేశ విధానాన్ని వివరించేందుకు ఆయన ఎంచుకున్న ప్లాట్ ఫామ్స్, సందర్భాలు అమోఘమని మెచ్చుకుంటున్నారు. రష్యా, భారత్ల మధ్య సంబంధాలపై వెస్ట్రన్ మీడియా, అమెరికా అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలపై భారత విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి జయశంకర్ అద్భుతమైన సమాధానం ఇచ్చారంటూ పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ ట్వీట్ చేశారు. భారత విధానాన్ని అంతర్జాతీయంగా సమర్థంగా ముందుకు తీసుకెళ్తున్న జయశంకర్కి రావాల్సినంత ప్రచారం ఎందుకు లభించడం లేదని కూడా ఆయన ప్రశ్నించారు. విజయ్ శేఖర్ శర్మ వెలిబుచ్చిన అభిప్రాయంతో ఏకీభవించారు ఎడిల్వైజ్ సీఈఓ రాధికా గుప్తా. విపత్కర పరిస్థితులను ఆత్మ విశ్వాసంతో ఎలా ఎదుర్కొవాలో చెప్పేందుకు ఈ సంభాషణ మాస్టర్ క్లాస్ అంటూ రాధికా గుప్తా అభిప్రాయపడ్డారు.
Our Indian team at international diplomacy is simply the best! What an incredible answer by MEA @DrSJaishankar 👌🏼👏🏼👏🏼👏🏼 https://t.co/qClNtPwJ7q
— Vijay Shekhar Sharma (@vijayshekhar) April 12, 2022
ఇలా ఇందరి ప్రశంసలు పొందేలా జయశంకర్ ఏం చేశారు ? ఏం చెప్పారు ? ఇదిప్పుడు ఆసక్తికరంగా మారింది. రష్యా 35 శాతం సబ్సిడీతో ముడిచమురు ఆఫర్ చేయడం.. దానికి ఇండియా ఓకే అనడం సహజంగానే అమెరికాకు, దానితో అన్ని అంశాల్లో యుఎస్తో అంటకాగే యుకెకు ఆగ్రహం తెప్పించింది. దీన్ని సాకుగా చూపి.. ఇండియాపై ఆంక్షలు విధించే అవకాశం వుందని అందరు భావించారు. కానీ పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా మారిపోయింది. అమెరికా మంత్రులతో జరిగిన 2+2 సమావేశంలో మంత్రి జయశంకర్ ముడిచమురు దిగుమతులపై వాస్తవాలను వెల్లడించారు. రష్యా నుంచి ఒక నెల రోజుల పాటు భారత్ ఎంత ముడిచమురును దిగుమతి చేసుకుంటుందో.. యూరప్ దేశాలు అంతే మొత్తం ముడిచమురును కేవలం ఒక్కపూటలో దిగుమతి చేసుకుంటున్నాయని జయశంకర్ గణాంకాలతో వివరించారు. అదేసమయంలో యుద్ధానికి తాము వ్యతిరేకమని, చర్చల ద్వారా ఇరు దేశాలు శాంతి కోసం ప్రయత్నించాలంటూ ఇప్పటికే అనేక వేదికల మీద భారత్ చెప్పిందని తేల్చి చెప్పారు జయశంకర్. ఇంకోవైపు మోడీ, బైడెన్ల మధ్య జరిగిన వర్చువల్ భేటీ తర్వాత వైట్ హౌజ్ ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కారణం భారత విధానం ఇపుడు పలు ప్రపంచ దేశాలకు ఆమోదయోగ్యం కావడమే. దాదాపు 40 దేశాలు ఇపుడు భారత తటస్థ విధానం వైపు మొగ్గుచూపుతున్నాయి. ఇది కచ్చితంగా భారత ప్రభుత్వ దౌత్య విధానమే అంటున్నారు. నిజానికి రష్యాపై ఆంక్షలు విధించిన చాలా యూరప్ దేశాలు రష్యా నుంచి ముడిచమురు దిగుమతులను నిలిపేయలేదు. రష్యాపై చమురు డిపెండెన్సీని వచ్చే అయిదేళ్ళలో తగ్గించుకుంటామని మాత్రమే చెప్పాయి. అంటే ఆంక్షలతో నిమిత్తం లేకుండా యూరప్ దేశాలు రష్యా నుంచి ముడిచమురును దిగుమతి చేసుకుంటున్నాయి. అమెరికా కూడా అణు సంబంధిత ముడి పదార్థాలైన యురేనియం వంటి దిగుమతులను కూడా రష్యానుంచి కొనసాగిస్తూనే వుంది. ఇక అమెరికా నుంచి ఇండియా తమ అవసరాల్లో 14 శాతం ముడిచమురును దిగుమతి చేసుకుంటుండగా.. రష్యా నుంచి కేవలం 2 శాతం మాత్రమే దిగుమతి చేసుకుంటుంది. గణాంకాల వివరణ తర్వాత అమెరికా, యుకెల వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఒకప్పుడు భారత్ వంటి దేశాలు అయితే రష్యా వైపు, లేకపోతే అమెరికా వైపు వుండాల్సిన పరిస్థితి. ఆనాటి పరిస్థితులు అలా వుండేవి. ప్రచ్ఛన్న యుద్ద కాలంలో ఇదే ధోరణి కొనసాగింది. భారత్ సుమారు 7 దశాబ్ధాలుగా రష్యాకు సన్నిహితంగా వుంటోంది. 1991 సంస్కరణల తర్వాత భారత్ ప్రపంచ పెద్ద మార్కెట్లలో ఒకటిగా ఎదగడంతో అమెరికా వైఖరిలో క్రమంగా మార్పు వచ్చింది. దానికితోడు మన దాయాది దేశం పాకిస్తాన్తో అంటకాగడం వల్ల అమెరికాకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. పైగా పాకిస్తాన్ చైనా కబంధ హస్తాల్లోకి చేరింది. మహిళా జనాభాను క్రమంగా కోల్పోతున్న చైనా.. పాకిస్తాన్లోని మహిళలను తమ దేశానికి తరలించడం లేదా వారి కీలక శరీర అంగాలను తీసుకుపోయి తమ దేశపు లాబోరేటరీలలో వినియోగించుకోవడం చేస్తోంది. అదేసమయంలో వ్యవసాయ యోగ్యమైన భూభాగం తక్కువగా వున్న చైనా.. తమ అధిక జనాభా ఆహార అవసరాలను తీర్చేందుకు పాకిస్తాన్ను వాడుకుంటోంది. సింధునదీ పరివాహక ప్రాంతంలో చైనా కార్పొరేట్ వ్యవసాయం చేస్తోంది. తద్వారా పాకిస్తాన్ను చైనా తమ దేశ అవసరాలకు వాడుకుంటోంది. పాక్, చైనాల మైత్రి తర్వాత అమెరికా.. భారత్తో ఒనగూడే ప్రయోజనాలను మధింపు వేసుకుంది. పాకిస్తాన్ కంటే భారత్తో సాన్నిహిత్యమే ముఖ్యమని అగ్రరాజ్యం భావిస్తోంది. ఇది కూడా తాజా పరిణామాలకు కారణమని అంతర్జాతీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఈ వారంలో భారత్ రానున్న బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ పర్యటన తర్వాత పరిణామాలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి.