కరోనా చికిత్స ప్లాస్మా థెరపీ సరైనదా..కాదా..? త్వరలో ICMR కొత్త మార్గనిర్దేశకాలు..! తెలుసుకోండి..
Plasma Therapy : 39 ట్రయల్ సెంటర్లలో 464 కొవిడ్ రోగులపై నిర్వహించిన ICMR అధ్యయనం ప్లాస్మా థెరపీ మరణాల రేటును తగ్గించడం
Plasma Therapy : 39 ట్రయల్ సెంటర్లలో 464 కొవిడ్ రోగులపై నిర్వహించిన ICMR అధ్యయనం ప్లాస్మా థెరపీ మరణాల రేటును తగ్గించడం లేదని తేలింది. దీంతో చికిత్స ఉపయోగం, దాని సమర్థతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఐసిఎంఆర్ ప్లాస్మా థెరపీ పద్దతిని సమీక్ష చేసి నూతన మార్గనిర్దేశకాలను జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. 18 మంది వైద్యులు, శాస్త్రవేత్తలు, ప్రజారోగ్య నిపుణుల బృందం ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్లాస్మా థెరపీ కోవిడ్ -19 కి కారణమయ్యే వైరస్ అయిన సార్స్-కోవ్ -2 వైరస్ జాతుల అవకాశాన్ని పెంచుతుందని ఆరోపిస్తూ లేఖలో తెలిపింది.
ప్లాస్మా చికిత్సపై దేశంలో ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలు శాస్త్రీయంగా లేవని వాదించడానికి, ఐసిఎంఆర్-ప్లాసిడ్ ట్రయల్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన రికవరీ ట్రయల్, అర్జెంటీనా ప్లాస్మ్ఆర్ ట్రయల్ అనే మూడు అధ్యయనాలను నిపుణులు తమ లేఖలో ఉదహరించారు. కొవిడ్ -19 చికిత్స కోసం ప్లాస్మా అందించినా ప్రయోజనం లేదని ప్రస్తుత పరిశోధన ఆధారాలు ఏకగ్రీవంగా సూచిస్తున్నాయి. ఐసిఎంఆర్ / ఎయిమ్స్ జారీ చేసిన మార్గదర్శకాల వల్ల ప్రస్తుతం ప్లాస్మా థెరపీని (ఏప్రిల్ 2021 వెర్షన్) ‘ఆఫ్ లేబుల్’ వాడకంగా సిఫారసు చేస్తున్నందున సమస్యలు ఎదురవుతున్నాయని బృందం పేర్కొంది. ఇది చాలా అసాధారణమైనదని, ఆఫ్-లేబుల్ వాడకం అంటే ‘ఆమోదించబడని ఉపయోగం’ అని సూచిస్తుందని తెలిపింది. ఇప్పుడున్న మార్గదర్శకాలను అత్యవసరంగా సమీక్షించి ఈ అనవసరమైన చికిత్సను తొలగించమని ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.
కరోనా సెకండ్ వేవ్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఇది తీవ్ర ఒత్తిడి కలిగిస్తోంది. రోగుల బంధువుల అభ్యర్థనలతో ప్లాస్మాకు డిమాండ్ పెరిగింది. దాతను పొందడం సాధ్యమే. అయితే ప్లాస్మా అనేది ప్రతిరోధకాలను కలిగి ఉన్న రక్తంలో ఒక భాగం. కోవిడ్ -19 నుంచి కోలుకున్న వ్యక్తులు నిర్దిష్ట సమయం తరువాత ప్లాస్మాను దానం చేయడానికి అనుమతిస్తారు. కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్లాస్మాలో ఉన్న కరోనావైరస్ వ్యాధికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిరోధకాలు రక్త మార్పిడి ద్వారా కొవిడ్ సోకిన వ్యక్తి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొంతవరకు రక్షణను కలిగిస్తాయి.