పద్దతిగా.. అంటు కట్టినట్టుగా! రీజనల్ ఫోర్స్ను జాగ్రత్తగా కూల్చుతున్న బీజేపీ!
ఏప్రిల్ 17.. బీజేపీ ఖాతాలో నమోదైన ఒకానొక బ్లాక్డే. లోక్సభ టేబుళ్ల మీదికొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయినప్పటి ఘోర పరాభవ దృశ్యం అది. 12 ఏళ్ల మోదీ జమానాలో ఒక రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటులో వీగిపోవడం ఇదే ఫస్ట్టైమ్. మహిళా రిజర్వేషన్ బిల్లును, డీలిమిటేషన్ చట్టాన్ని లింక్ చేస్తూ ఎన్డీఏ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తిరగ్గొట్టి వికటాట్టహాసం చేసింది హస్తం పార్టీ. మూడింట రెండొంతుల మెజారిటీ దక్కక పీఛేముడ్ కొట్టింది ఎన్డీఏ. కమలం పార్టీకి ఇదొక సెట్బ్యాక్, ఓడిపోతామని తెలిసినా ఎందుకు ఓటింగ్కు వెళ్లారు, నంబర్గేమ్లో అమిత్షా ఎలా వెనకబడ్డారు? అని దేశమంతా అవాక్కయిన సందర్భం అది. కానీ, సరిగ్గా రెండునెలలు గడిచిందో లేదో లెక్కలు దాదాపు తారుమారయ్యాయి. లోక్సభలోనే కాదు, రాజ్యసభలో కూడా చకచకా మారిపోతున్నాయి నంబర్స్. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఇన్డీ కూటమి బక్కపల్చనైపోయింది. ఎన్డీఏ కూటమి బలపడుతూ వస్తోంది. ఇట్స్ షోటైమ్ అంటూ అమిత్షా ఆడుతున్న చదరంగంలో ఒక్కో రాష్ట్రంలో రాజకీయం రంగుమార్చుకుంటోంది. ముఖ్యంగా ఢిల్లీలో చక్రం తిప్పుదామనుకున్న ప్రాంతీయ పార్టీలకు ఈస్ట్మన్ కలర్లో కనిపిస్తోంది సినిమా.

అప్పట్లో యూపీలో బీపీలు రేపిన ఏనుగు పార్టీ మాయావతి ఇప్పుడెక్కడున్నట్టు? బెంగాల్లో రెండాకుల గుర్తు మమతాబెనర్జీ ఫ్యూచర్ ఏమైనట్టు? చీపురుకట్టతో ఊడ్చేస్తానంటూ ఢిల్లీ గద్దెనెక్కిన కేజ్రీవాల్ గురితప్పిన వైనమేంటి? సౌత్లో ఢిల్లీని ఎదిరించి సూపర్స్టార్గా ప్రకటించుకున్న ఎంకే స్టాలిన్, మరాఠీ గడ్డ మీద చెలరేగిన ఉథ్థవ్ థాక్రే.. బిహార్లో నితీశ్కుమార్, ఒడిషాలో నవీన్ పట్నాయక్.. ఒక్కొక్కరు యోధానుయోధులు. బీజేపీకి కొరకరాని కొయ్యలు. ఇప్పుడు వీళ్లందరి పునాదులు కదిలిపోయి, పూలు అమ్ముకున్నచోటే కట్టెలమ్ముకోవాల్సిన విపత్కర పరిస్థితి. కనీసం ఢిల్లీ వైపు కన్నెత్తి చూడ్డానిక్కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. ప్రాంతీయ పార్టీల ఐక్యత వర్ధిల్లాలి అని ఢిల్లీ దాకా పొలికేక పెట్టిన ఈ కటౌట్లన్నీ ఇప్పుడు కుప్పకూలి కనిపిస్తున్నాయంటే.. మూల కారణం ఏదై ఉంటుంది? లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, NDA మిత్రపక్షంగా కొత్తగా ఎంట్రీ ఇచ్చిన NCPI. నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా… త్రిపుర ఎన్నికల్లో పోటీచేసినా అసెంబ్లీలో కనీసం ఖాతా తెరవలేని ఒక అనామక పార్టీ, నోటా కంటే తక్కువ ఓట్లొచ్చి డిపాజిట్లు గల్లంతైన జీరోసైజు పార్టీ.. ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ మేజర్ పార్ట్నర్గా కొత్తగా అవతారమెత్తింది. వాటే మిరాకిల్ కదా? బెంగాల్లో అపోజిషన్ను చిత్తుచెయ్యడానికి బీజేపీ టాప్ కమాండర్లు ఆడిన పవర్గేమ్ క్లయిమాక్స్ ఇది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత, మమతాబెనర్జీకి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 28 మంది లోక్సభ ఎంపీల్లో 20 మంది రెబల్స్గా మారారు....
