Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో చారిత్రాత్మక తీర్పు వెలువరించిన వారణాసి కోర్టు..
జ్ఞానవాపి కేసులో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఏఎస్ఐ సర్వే నివేదికలో నివ్వెరపోయే నిజాలు బయటకు రాగా.. లేటెస్ట్గా జ్ఞానవాపి మసీదులో పూజలు చేసుకునేందుకు హిందువులకు అనుమతి ఇచ్చింది వారణాసి కోర్ట్. అంతేకాదూ వారం రోజుల్లో పూజలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.

జ్ఞానవాపి కేసులో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఏఎస్ఐ సర్వే నివేదికలో నివ్వెరపోయే నిజాలు బయటకు రాగా.. లేటెస్ట్గా జ్ఞానవాపి మసీదులో పూజలు చేసుకునేందుకు హిందువులకు అనుమతి ఇచ్చింది వారణాసి కోర్ట్. అంతేకాదూ వారం రోజుల్లో పూజలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. సీల్ చేసిన 10 సెల్లార్లలో హిందూ దేవతల ప్రతిమలకు పూజలకు ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. మరోవైపు పూజలు ప్రారంభిస్తామని ప్రకటించింది కాశీ విశ్వనాథ్ ట్రస్ట్. హిందువుల తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ దీనిపై స్పందించారు. “కేసులో మలుపు” ఇది అని,”చారిత్రాత్మక తీర్పు” అని పేర్కొన్నారు.
ప్రభుత్వ సమ్మతి కోసం తాము ఆర్డర్ కాపీని జిల్లా మేజిస్ట్రేట్కు పంపామని జైన్ తెలిపారు. ఏడు రోజుల్లో పూజలు ప్రారంభమవుతాయని పేర్కొన్న జైన్, పూజ ఎలా చేయాలో కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్ నిర్ణయిస్తుందని చెప్పారు. త్వరలోనే న్యాయపోరాటం పూర్తి చేసి విజయం సాధిస్తామని ఆయన తెలిపారు. ఈ ప్రాంగణాన్ని ఏ వ్యక్తి అయినా సందర్శించే అవకాశం ఉంటుందన్నారు. ఈ కేసు వ్యాస్ కుటుంబానికి సంబంధించింది. వారి కుటుంబసభ్యులే 1993 వరకు నేలమాళిగలో పూజలు చేసేవారు. అయితే, గతంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశంతో పూజలు నిలిపివేయబడ్డాయి. తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుతో తిరిగి పూజలు ప్రారంభంకానున్నాయి.
హైకోర్టులో జ్ఞానవాపి మసీద్ కమిటీ సవాల్..
అయితే ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేయనుంది జ్ఞానవాపి మసీద్ కమిటీ. జిల్లా కోర్టు ఆదేశాలను అలహాబాద్ హైకోర్టులో సవాలు చేస్తామని అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ తెలిపింది. దీనిని వ్యతిరేకిస్తూ, హిందువుల తరపు న్యాయవాది విష్ణు జైన్ అలహాబాద్ హైకోర్టు ముందు తమ వాదనలు వినిపించాలని కేవియట్ దాఖలు చేయనున్నారు. ఇదిలా ఉంటే జ్ఞానవాపి మసీదు కేసులో తదుపరి విచారణను వారణాసి కోర్టు ఫిభ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది.
చరిత్ర ఇలా..
హిందూ ఆలయాన్ని కూల్చి జ్ఞానవాపి మసీదును నిర్మించారని కొద్దిరోజుల క్రితమే భారత పురావస్తు శాఖ సంచలన సర్వేను విడుదల చేసింది. దీనికి సంబంధించిన 1500 పేజీల నివేదికను వారణాసి కోర్టులో సమర్పించింది. తెలుగు, కన్నడతో సహా నాలుగు భాషల్లో 36 శాసనాలు లభించినట్టు ఏఎస్ఐ వెల్లడించింది. కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని 1669లో మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబ్ ధ్వంసం చేసి మసీదును నిర్మించారని హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఔరంగాజేబ్ కాలంలో హిందూ ఆలయ స్థానంలో ఈ మసీదు నిర్మించారని, ఈ విషయాన్ని సర్వే నిర్వహించి తేల్చాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఉత్తర్వులిచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వాజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణమంతా కార్బన్ డేటింగ్, ఇతర పద్ధతుల ద్వారా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేను నిర్వహించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








