చెన్నపురిలో తెలుగు వెలుగు.. తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ సభ జరగాల్సిందే.
చెన్నైలో తెలుగు భాష, సాహిత్య పరిరక్షణకు గుడిమెట్ల చెన్నయ్య దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. జనని సాంస్కృతిక సమితి ద్వారా సాహిత్య సభలు, విద్యార్థులకు తెలుగు పోటీలు నిర్వహిస్తూ భాషా చైతన్యానికి పాటుపడుతున్నారు. కవి, రచయిత, వక్త, సాహిత్య సేవకుడిగా గుర్తింపు పొందిన చెన్నయ్య ఇటీవల 75వ పుట్టినరోజు జరుపుకున్నారు. 2025లో ఏపీ ప్రభుత్వం ఉగాది పురస్కారంతో సత్కరించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుపల.. ఏ వీధిలోకి వెళ్లిన శ్రావ్యమైన తెలుగు వినిపించే నగరం ఏదైనా ఉందంటే అది చెన్నై అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగువారిచ్చిన స్థలంలో, తెలుగు ప్రముఖుల ఆశీస్సులతో అభివృద్ధి చెందినదే మద్రాసు మహానగరం. ఎందరో మహనీయులు నడయాడిన ఆ నేల ఇప్పటికి తెలుగు వారికి అత్యంత ప్రీతిప్రాతమైన ప్రదేశం. తెలుగుకు వెలుగునిచ్చిన చెన్నపురిని తన సాహితీ సేద్యానికి కార్యక్షేత్రంగా మార్చుకున్న బహుకొద్దిమందిలో గుడిమెట్ల చెన్నయ్య అగ్రగణ్యులని చెప్పేందుకు సందేహించకూడదు. ఆయన మాట తెలుగు, ఆయన ఆట తెలుగు, ఆయన శ్వాస తెలుగు.. తమిళనాడులోను తెలుగును బతికించేందుకు కంకణం కట్టుకుని రాత్రి పగలు అదే పనిమీద ఉన్న చెన్నయ్య పలువురు సాహితీప్రియులకు ఆదర్శ ప్రాయుడు అని అంగీకరించాల్సిందే. తెలుగు కోసమే పుట్టి, తెలుగు కోసమే ఎదిగి, తన 75 ఏళ్ల వయసులోనూ తెలుగు తెలుగు అంటూ కలవరించే ఏకైన సాహిత్యాభిమాని చెన్నయ్య. అసలు చెన్నై, చెన్నయ్య రెండు ఒకటే అన్నట్లుగా చెన్నపురిలో తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ ఒక సభ పెట్టి వారిని ప్రోత్సహించే భాషాభిమాని చెన్నయ్య…
చెన్నయ్య, జనని సాంస్కృతిక సమితి.. ఒకే నాణెనికి రెండు వైపుల లాంటి వాళ్లు. చెన్నయ్య వస్తున్నారంటే జనని సాంస్కృతిక సమితి నడుచుకుంటూ వస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. చెన్నైలో తెలుగు భాషను ప్రోత్సహించేందుకే చెన్నయ్య.. జనని సంస్థను ప్రారంభించారు. వాట్సాప్, ఫేస్ బుక్ లేని రోజుల్లో, సోషల్ మీడియా అంటే ఏమిటో తెలియని టైములో ఎక్కే బస్సు, దిగే బస్సు అన్నట్లుగా తిరుగుతూ చెన్నయ్య సాహిత్య సభలకు ఏర్పాటు చేసేవారు. బడి పిల్లలకు తెలుగు భాషలో పోటీలు పెట్టి సొంత డబ్బులతో పురస్కారాలు ప్రదానం చేసేవారు. తమిళనాట తెలుగు బాలలు మాతృభాషను మరిచిపోకుండా చూడాలన్న ఏకైక ఆకాంక్షతో చెన్నయ్య అలుపెరుగుని యోధుడిలా పోరాడేవారు. ఏడు పదులు దాటిన వయసులో ఇప్పుడు కూడా చెన్నయ్య అదే ఊపు, అదే ఉత్సాహం, అదే సాహిత్యాభిమానంతో తెలుగు తల్లికి సేవచేస్తున్నారు. జనని సాంస్కృతిక సమితి తరపున ఏడాదికి కనీసం అరడజలు కార్యక్రమాలను నిర్వహిస్తూ.. తెలుగు ప్రజల్లో భాషా చైతన్యానికి ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. తమిళనాడు ప్రభుత్వం తెలుగు పట్ల వివక్ష చూపుతూ సాధ్యమైనంత వరకు మైనార్టీ భాషలను నిరుత్సాహపరచాలని చూస్తున్నప్పటికీ.. చెన్నయ్య లాంటి వాళ్లు భాషను కాపాడేందుకు అహరహం కృషి చేస్తున్నారు…
కవిగా, కథా రచయితగా, సరస భాషా చతురుడిగా, సాహిత్య సేవకుడిగా, విమర్శకుడిగా, ఉపన్యాసకుడిగా చెన్నయ్య బహుముఖ ప్రజ్ఞ 75 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉద్యోగం ఆయన వృత్తి అయితే, సాహిత్య సేవ ఆయన ప్రవృత్తిగా చెప్పుకోవాల్సిందే. రిటైరైన తర్వాత ఆయన వృత్తి, ప్రవృత్తి .. రెండు కూడా సాహిత్య సేవేనని అంగీకరించాల్సిందే. సింహపురి ఆయన జన్మభూమి, చెన్నపట్నం ఆయన స్థిరపడిన చోటు. గుడిమెట్ల చెన్నయ్య.. 1950లో పుట్టారు. అప్పటి మద్రాసు రాష్ట్రంలో భాగమైన తెలుగు ప్రాంతం నెల్లూరు జిల్లా కనిగిరి మండలం తమటంవారిపాలెం ఆయన జన్మస్థలం. గుడిమెట్ల చంద్రయ్య, గుడిమెట్ల కొండమ్మ దంపతుల సంతానంలో ఆయన ఒకరు. చెన్నయ్య విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది. త్యాగరాయ కళాశాలలో చదువుకున్న గుడిమెట్ల చెన్నయ్య… కొంతకాలం తమిళనాడు ప్రభుత్వ డైరీ డెవలప్మెంట్ డిపార్టమెంటులో పనిచేసిన తర్వాత బ్యాంకింగ్ రంగానికి బదిలీ అయ్యారు.
పాఠశాల దశలోనే సాహిత్యాభిమానిగా మారిన చెన్నయ్య.. కంఠస్థీకరణ, వక్తృత్వ, వ్యాసర చన పోటీలలో బహుమతులు అందుకున్నారు. చెన్నయ్య తొలి సారిగా రాసిన ‘ ఎవరు గాడిద? ‘ అనే కథ పాఠశాల ప్రత్యేక సంచికలో ప్రచురితమైంది. తరువాత కళాశాలలో చదివేటప్పు డు’ తగిన వ్యక్తి ‘ అనే మరో కథను రాశారు. అలాగే 1969 లో’ పద్మశ్రీ అక్కినేని ‘ అనే సంకలనానికి అక్కినేని నాగేశ్వరరావు గురించి ‘ఆంధ్రకళామతల్లి సుపుత్రుడు ‘ అనే వ్యాసం రాశారు. చెన్నయ్య రాసిన కథలు, కవితలు…. ప్రియ దత్త, ఆటవిడుపు, జగతి, రమ్యభారతి, క్లబ్ క్లాస్, సురభి, నెలవంక నెమలీక, ప్రముఖాంధ్ర, సాహిత్య ప్రస్థానం మొదలయిన పత్రికలలో ప్రచురితమయ్యాయి. మూడు కవితా సంకలనాలను కూడా ప్రచురించారు. సగటు మనిషి పడే ఆవేదన, సమాజంలో పెరిగిపోతున్న దమనకాండ, అలజడులు, అల్లర్లు, మానభంగాలు, దోపిడీలను చూసి చెన్నయ్య చలించిపోతారు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. అన్న చందంగా సమాజం దిగజారిపోతోందని చెన్నయ్య నిత్యం ఆవేదన చెందుతారు. తెలుగు సాహిత్యానికి ఆయన ఎంతటి సేవ చేస్తున్నారో.. మానవతా విలువలు పెంచేందుకు కూడా అదే స్థాయిలో పనిచేస్తున్నారు..
గుడిమెట్ల చెన్నయ్య, జనని సాంస్కృతిక సమితి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా మాత్రమే కాకుండా.. అనేక గౌరవ పదవులను అలంకరించారు. శ్రీ వెంకటేశ్వర కళానిలయం అధ్యక్షుడిగా, పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఎడ్యుకే షనల్ వెల్ఫేర్ (ఇండియా)కోశాధికారిగా, రెడిహిల్స్ టీకేపీ క్రికేట్ క్లబ్ సలహాదారుగా, ముత్తమిల్ ఆయు మండ్రం శాశ్వత సభ్యుడిగా, ఐఓబీ తెలుగు సాంస్కృతిక సమితి వ్యవస్థాపకుడిగా, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి సంయుక్త కార్యదర్శిగా, యూత్ ఎడ్యుకేషన్ అండ్ వెల్పేర్ అసోసియేషన్ సలహాదారుగా, మద్రాసు విశ్వవి ద్యాలయం బోర్డాఫ్ స్టడీస్ ఇన్ తెలుగు (కామన్) బోధనేతర సభ్యుడిగా, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటి సభ్యుడిగా,తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం సలహాదారుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగే అనేక సాహిత్య కార్యక్రమాలకు ఆయనకు ఆహ్వానాలు కూడా అందుతుంటాయి. చెన్నయ్య సేవలను గుర్తించి అనేక సంస్థలు, ప్రభుత్వాలు ఆయనకు పురస్కారాలు ప్రదానం చేశాయి. 2025 మార్చి 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ‘శ్రీవిశ్వావసు నామ ఉగాది పురస్కారం’ అందుకున్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటిచెప్పడమే ధ్యేయంగా భాషా సేవ చేస్తున్న చెన్నయ్య ఇటీవలే తన 75న పుట్టినరోజు జరుపుకున్నారు. ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆశిద్దాం..
-ఏ.బొల్లంరాజు
