3-0తో గెలిచినా టీమిండియాకు దిమ్మతిరిగే షాక్.. చేజారిన నంబర్ 1 ప్లేస్.. ఎందుకంటే?
T20I Rankings: అఫ్గానిస్థాన్పై 3-0తో సిరీస్ క్లీన్స్వీప్ సాధించిన భారత క్రికెట్ జట్టు (Team India)కు టీ20 ర్యాంకింగ్స్లో ఊహించని మార్పు ఎదురైంది. శ్రీలంకపై వరుసగా 3 మ్యాచ్లు గెలిచిన ఇంగ్లండ్ (England) అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గత 2 నెలల్లో భారత్, ఇంగ్లండ్ మధ్య నంబర్వన్ స్థానం 3 సార్లు చేతులు మారడం విశేషం.

T20I Rankings: టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో భారత క్రికెట్ జట్టు (Team India) అగ్రస్థానాన్ని కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) నాయకత్వంలోని భారత్ ఇటీవల అఫ్గానిస్థాన్ (Afghanistan)పై 3-0తో సిరీస్ క్లీన్స్వీప్ సాధించినా నంబర్వన్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. మరోవైపు శ్రీలంక (Sri Lanka)తో జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఇంగ్లండ్ (England) పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా శనివారం జరిగిన చివరి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను 3-0తో సొంతం చేసుకుంది. ఈ విజయంతో ప్రపంచ ఛాంపియన్ భారత్ను వెనక్కి నెట్టి టీ20 ప్రపంచ ర్యాంకింగ్స్లో ఇంగ్లండ్ మళ్లీ మొదటి స్థానానికి చేరుకుంది. గత 2 నెలల్లో ఈ 2 జట్ల మధ్య నంబర్వన్ స్థానం 3 సార్లు మారింది.
శ్రీలంకతో సిరీస్లో ఇంగ్లండ్ వరుసగా భారీ విజయాలు నమోదు చేసింది. సౌతాంప్టన్లో జరిగిన మ్యాచ్లో 119 పరుగుల తేడాతో గెలిచింది. కార్డిఫ్లో 6 వికెట్లతో విజయం సాధించింది. చివరి పోరులోనూ అదే జోరు కొనసాగించింది.
మాంచెస్టర్ మ్యాచ్లో తొలుత శ్రీలంకను 124 పరుగులకే ఇంగ్లండ్ కట్టడి చేసింది. సోనీ బేకర్ (Sonny Baker), జోఫ్రా ఆర్చర్ (Jofra Archer), విల్ జాక్స్ (Will Jacks) తలో 2 వికెట్లు పడగొట్టారు. బేకర్ తన మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో 3.5 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు సాధించాడు.
స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ 10 ఓవర్లలోపే ఛేదించింది. జోస్ బట్లర్ (Jos Buttler) అజేయంగా 62 పరుగులు చేశాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook)తో కలిసి 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఇంగ్లండ్ తాజా ఫామ్ను గణాంకాలు కూడా స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ జట్టు చివరి 26 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో 23 విజయాలు నమోదు చేసింది. శ్రీలంక సిరీస్లో బ్రూక్ 170 పరుగులు సాధించాడు.
టీ20ల్లో ప్రపంచ నంబర్వన్ స్థానాన్ని తిరిగి సాధించడం జట్టు మొత్తం గర్వించదగ్గ విజయమని బ్రూక్ పేర్కొన్నాడు. అవకాశాలు తక్కువగా లభించిన ఆటగాళ్లు కూడా కీలక పాత్ర పోషించారని ప్రశంసించాడు. టీ20 సిరీస్లో నిరాశ ఎదురైన శ్రీలంక ఇప్పుడు వన్డేలపై దృష్టి పెట్టనుంది. ఇంగ్లండ్తో 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో తొలి పోరు మంగళవారం చెస్టర్-లీ-స్ట్రీట్లో జరగనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
