AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాళ్లకు చెప్పులు లేకుండా.. చేతిలో రాజ్యాంగ ప్రతితో వేదికపైకి! కర్ణాటక సీఎం పీఠంపై కూర్చున్న డీకే శివకుమార్!

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చిరకాల రాజకీయం కల నెరవేరింది. బుధవారం (మే 3, 2026) ఆయన కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు.

కాళ్లకు చెప్పులు లేకుండా.. చేతిలో రాజ్యాంగ ప్రతితో వేదికపైకి! కర్ణాటక సీఎం పీఠంపై కూర్చున్న డీకే శివకుమార్!
Cm Dk Shivakumar Barefoot
Balaraju Goud
|

Updated on: Jun 03, 2026 | 5:20 PM

Share

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నో ఏళ్లుగా ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చిరకాల రాజకీయం కల నెరవేరింది. బుధవారం (మే 3, 2026) ఆయన కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు.

ప్రమాణ స్వీకార వేదికపై డీకే శివకుమార్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని, భక్తిశ్రద్ధలతో చెప్పులు లేకుండా ఆయన వేదికపైకి రావడం అందరినీ ఆకట్టుకుంది. ప్రమాణ స్వీకారానికి ముందు, ఆయన వేదికపై ఉన్న ప్రతి నాయకుడిని ఒక్కొక్కరిగా కలిసి, పుష్పగుచ్ఛాలతో సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం సరస్వతీ దేవి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, నేరుగా ప్రమాణ స్వీకారానికి వెళ్లారు. రాజ్ భవన్‌కు చెందిన గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, డీకే శివకుమార్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీసన్‌లతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన అనేకమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు వేదికపై మెరిశారు. ఈ సందర్భంగా ఖర్గే, రాహుల్ గాంధీలతో డీకే శివకుమార్ క్లుప్తంగా మాట్లాడారు. శివకుమార్ ప్రమాణ స్వీకారం అనంతరం, గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్.. జి. పరమేశ్వరతో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన డీకే శివకుమార్, రాష్ట్రంలో అత్యున్నత పదవిని దక్కించుకోవడానికి సుదీర్ఘ కాలం వేచి చూడాల్సి వచ్చింది. ముఖ్యంగా శివకుమార్, సిద్దరామయ్యల మధ్య గత కొంతకాలంగా సాగుతున్న అంతర్గత నాయకత్వ పోరుతో కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు మే 28న సిద్దరామయ్య తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఈ సస్పెన్స్‌కు తెరపడింది.

మొదట్లో రాజీనామాకు విముఖత చూపిన సిద్ధరామయ్య, అధిష్టానంతో పలు దఫాల చర్చల అనంతరం అంగీకరించారు. వర్గాల సమాచారం ప్రకారం సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసినప్పటికీ ఆయన దానిని తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం గమనార్హం. ఈ కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో కర్ణాటకలో డీకే శివకుమార్ పాలనా శకం మొదలైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us