AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్‌ రాజకీయం చేస్తుంది: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారంటే..

నీట్ పేపర్ లీక్ అంశంపై కాంగ్రెస్ విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం పార్లమెంట్‌లో చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ రాజకీయ ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చిందని ఆరోపించారు. ప్రధాని నివాసం ఎదుట రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన నిరసనపై స్పందించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఇది భారత రాజకీయ చరిత్రలో ఒక చీకటి రోజని పేర్కొంటూ ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాంగ్రెస్ ఉల్లంఘించిందని విమర్శించారు.

విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్‌ రాజకీయం చేస్తుంది: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారంటే..
Dharmendra Pradhan
Shaik Madar Saheb
|

Updated on: Jul 22, 2026 | 10:37 AM

Share

దేశ రాజధాని ఢిల్లీ ఆందోళనలతో అట్టుడుకుతోంది. సీజేపీ, కాంగ్రెస్ ధర్నాలతో హైటెన్షన్ నెలకొంది. విద్యార్థులపై లాఠిచార్జ్‌కు నిరసనగా.. ప్రధాని నివాసం దగ్గర 3 గంటలపాటు కాంగ్రెస్‌ మెరుపుధర్నా నిర్వహించింది. పార్లమెంటు వాయిదా తర్వాత పాదయాత్ర చేసిన కాంగ్రెస్‌ ఎంపీలు.. నేరుగా ప్రధాని నివాస దగ్గరకు వెళ్లి ధర్నా నిర్వహిచారు. నీట్‌ పేపర్‌ లీక్‌పై ప్రధాని, హోంమంత్రి, విద్యాశాఖ మంత్రి రాజీనామాకు రాహుల్‌ డిమాండ్‌ చేశారు. కాగా.. రాహుల్‌, ప్రియాంక సహా.. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ తర్వాత రాత్రి విడుదల చేశారు. ‘చలో సంసద్’ మార్చ్ సందర్భంగా కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకారులపై పోలీసుల చర్యలు, కాంగ్రెస్ ధర్నా.. తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం తొలిసారిగా స్పందించారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను రాజకీయ సాధనంగా వాడుకుంటున్నాయని ఆరోపించారు. నీట్ పేపర్ లీక్ వివాదానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయకుండా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కాంగ్రెస్ గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ప్రధాన్ ఆరోపించారు.

పార్లమెంటులో నీట్ అంశంపై సవివరంగా చర్చించడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినప్పటికీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం వెలుపల నిరసన చేపట్టారని కేంద్ర మంత్రి Xలో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. సమగ్ర చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తెలియజేసినప్పటికీ, కాంగ్రెస్ ప్రజాస్వామ్య చర్చ కన్నా రాజకీయ ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. విద్యార్థులకు పరిష్కారాలు కనుగొనడం కాకుండా కేవలం రాజకీయ శీర్షికల కోసం గందరగోళం సృష్టించడమే కాంగ్రెస్ ఉద్దేశం.. రాహుల్ గాంధీకి విద్యార్థులు అవసరం లేదు.. గొడవలు సృష్టించడమే లక్ష్యమంటూ పేర్కొన్నారు.. విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్‌ రాజకీయం చేస్తుందని ఆరోపించారు. మా ప్రభుత్వం నీట్ (NEET) గురించి చర్చించడానికి సభలో మన యువతకు సంబంధించిన ప్రతి నిజమైన ఆందోళనను పరిష్కరించడానికి 100% కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. విద్యార్ధులకు సమాధానాలు, సంస్కరణలు, జవాబుదారీతనం అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.

ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్..

భారత రాజకీయ చరిత్రలో ఒక చీకటిరోజు- నితిన్‌ నబీన్‌

ప్రధాని నివాసం ఎదుట రాహుల్ గాంధీ ధర్నాను బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఖండించారు. ప్రజాస్వామ్య నియమాలకు విరుద్ధంగా రాహుల్ గాంధీ వ్యవహరించారు. ప్రతిపక్ష నాయకుడి హోదాకు తగిన విధంగా రాహుల్ గాంధీ వ్యవహరించడం లేదు .. ఈ సంఘటన నిస్సందేహంగా దురదృష్టకరం. ఇది భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక చీకటి రోజు. కూడా సంవత్సరాలుగా ప్రతిపక్షంలో మా పాత్ర పోషించాము.. కానీ ప్రజాస్వామ్య నియమాలను, పార్లమెంటరీ సంప్రదాయాలను ఎన్నడూ ఉల్లంఘించలేదు. విద్యార్థులు లేవనెత్తుతున్న సమస్యలపై ప్రభుత్వం చర్చించాలనుకుంటోంది. రాహుల్ గాంధీ స్వయంగా ముందుకు తెచ్చిన షరతులను కూడా ప్రభుత్వం అంగీకరించింది. కానీ చర్చలకు, పరిష్కారానికి అవకాశం వచ్చినప్పుడు, ఆయన తన సొంత షరతుల నుంచి వెనక్కి తగ్గారని నబీన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది ఆయన రాజకీయ ప్రవర్తనలోని అస్థిరతను, అపరిపక్వతను స్పష్టంగా బయటపెడుతుంది. ప్రజాస్వామ్యంలో, ప్రతి ప్రతిపక్ష పార్టీకి నిరసన తెలిపే హక్కు ఉంటుంది.. కానీ నిరసనకూ, అరాచకానికీ మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంటుందని పేర్కొన్నారు. నిరసన దాని హద్దులు దాటినప్పుడు, అది అరాచక రూపం తీసుకుంటుందని నబీన్ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us