Delhi CM Arvind Kejriwal: ఆ సంస్థలు తన నియంత్రణలో ఉంటే బీజేపీ నాయకులు జైలులోనే.. ఢిల్లీ అధినేత కీలక వ్యాఖ్యలు..
కొంత కాలంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ పార్టీపై..
కొంత కాలంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ పార్టీపై మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ నాయకులపై 167 కేసులు నమోదు చేసినప్పటికీ, ఏ దర్యాప్తు సంస్థ కూడా వారు తప్పు చేసినట్లుగా నిరూపించలేకపోయిందని అన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ “గత ఏడేళ్లలో వారు(బీజేపీ) ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులపై 167 కేసులు పెట్టారు. కానీ ఏ ఒక్కటి కూడా కోర్టులో రుజువు కాలేదు. మా నాయకులు 150కి పైగా కేసులలో నిర్ధోషులుగా బయటకు వచ్చారు. మిగిలిన కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి.
కేంద్ర దర్యాప్తు సంస్థలకు చెందిన 800 మంది అధికారులు ఆప్ నేతల తప్పులను నిరూపించడానికే పనిచేస్తున్నారు. కానీ వారికి ఏ తప్పులు దొరకడంలేదు. అందుకే దర్యాప్తు సంస్థలన్నీ కోర్టులకు ఎక్కుతున్నాయి. ‘పూర్తిగా స్వచ్ఛమైన, నిస్పక్షపాతంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నామ’ని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకోవడంపై కేజ్రీవాల్ను ప్రశ్నించగా “ సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలపై నాకు ఒకే ఒక్క రోజు పూర్తి నియంత్రణ బాధ్యతలను అప్పగించండి. ఆ ఒక్క రోజులోనే బీజేపీలోని సగం మంది నాయకులు జైల్లో ఉంటారు” అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
కాగా, ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ ఆరోపణలపై ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ఆరు నెలలుగా జైలులోనే ఉన్నారు. ఎక్సైజ్ పాలసీ 2021-22 అమలులో ఆరోపించిన కుంభకోణంలో.. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ తన ఎఫ్ఐఆర్లో నిందితుడిగా పేర్కొంది. ఇంకా ఆప్ కమ్యూనికేషన్ ఇన్చార్జి విజయ్ నాయర్ కూడా ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమని ఆప్ పేర్కొంది.
ఇక ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) ఎన్నికల్లో ఆప్ భారీ మెజారిటీతో గెలుస్తుందని కేజ్రీవాల్ చెప్పారు. ఎంసీడీలోని 250 సీట్లలో ఆప్కి 230 ప్లస్ సీట్లు వస్తాయని, బీజేపీకి 20లోపే సీట్లు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే నెల మొదటి వారంలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఆప్ గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..