Andhra News: 1500 గొర్రెలతో MRO ఆఫీస్ను ముట్టడించిన కాపర్లు.. కారణం తెలిస్తే..
పశువులకు మేత దొరకకపోతే ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడం సాధారణం. కానీ, ఇక్కడి గొర్రెల కాపరులు మాత్రం తమ సమస్య పరిష్కారం కోసం వినూత్న రీతిలో నిరసనకు దిగారు. జీవాలకు పచ్చిగడ్డి దొరకడం లేదంటూ ఏకంగా వందలాది గొర్రెలతో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈఘటన ఘటన శ్రీసత్యసాయి జిల్లా అమరాపురంలో చోటుచేసుకుంది.

పచ్చి గడ్డి దొరకట్లేదని ఏకంగా గొర్రెలను ఎమ్మార్వో ఆఫీస్కే తీసుకొచ్చిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. అమరాపురం మండలం తమ్మిడేపల్లి గ్రామంలో గత కొంతకాలంగా గొర్రెలు, మేకలకు పచ్చిగడ్డి కొరత తీవ్రమైంది. రైతులు పంటలు సాగు చేస్తుండటంతో పొలం గట్లపై ఉన్న గడ్డిని మేసేందుకు జీవాలను అనుమతించడం లేదు. గ్రామ శివారులోని చెరువు గట్టుపై మేపుదామనుకుంటే, ఆ ప్రాంతం పూర్తిగా ఆక్రమణలకు గురికావడంతో మేత కరువైంది.
పరిస్థితి విషమించడంతో ఏం చేయాలో పాలుపోని గొర్రెల కాపరులు సుమారు 1,000 నుంచి 1,500 గొర్రెలను తోలుకుని అమరాపురం తహసీల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయానికి చేరుకున్నారు. ఒకవైపు మూగజీవాలు మే.. మే.. అంటూ అరుస్తుంటే, మరోవైపు కాపరులు మేత కావాలి అంటూ నినాదాలు చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. పశువుల మేత స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుని, భూములను రక్షించాలని డిమాండ్ చేశారు.
గొర్రెల కాపరుల నిరసనతో స్పందించిన రెవెన్యూ అధికారులు వారితో చర్చలు జరిపారు. కబ్జాకు గురైన చెరువు భూములను గుర్తించి స్వాధీనం చేసుకుంటామని, జీవాలకు పచ్చిమేత లభించేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారుల నుంచి స్పష్టమైన హామీ లభించడంతో కాపరులు తమ ఆందోళనను విరమించారు. ఈ వినూత్న నిరసన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
