రైతన్న ఇంకా టైం ఉంది.. సెప్టెంబర్లో కూడా అధిక దిగుబడినిచ్చే ఆరుతడి పంటలు ఇవే..
ఎల్నీనో ప్రభావంతో లోటు వర్షపాతం కారణంగా ఖరీఫ్ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ సంక్షోభ సమయంలో రైతులు నష్టపోకుండా సెప్టెంబర్ నెలలో సాగు చేయదగిన లాభదాయక పంటలపై దృష్టి సారించవచ్చు.. శనగ, పెసర, మినుము వంటి ఆరుతడి పంటలు అధిక దిగుబడిని అందిస్తూ, రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. సరైన ఎంపికతో అధిక లాభాలు పొందవచ్చు.

ఎల్నీనో ప్రభావంతో సాధారణం కంటే.. వర్షపాతం తక్కువగా నమోదైంది.. దీని కారణంగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాలపై తీవ్ర ప్రభావం పడింది. దేశవ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం (లోటు వర్షపాతం) నమోదవుతోంది. ఇది వ్యవసాయ సాగుపై, ముఖ్యంగా ఖరీఫ్ పంటల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే.. చాలా ప్రాంతాల్లో వర్షాలు లేక అన్నదాతలు వరుణ దేవుడి కటాక్షం కోసం ఎదురుచూస్తున్నారు. పంటలు వేసినప్పటికీ.. నీరు లేక ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇదిలాఉంటే.. చాలా మంది రైతులు పంటలే వేయలేదు.. ఇలాంటి పరిస్థితుల్లో సెప్టెంబర్ నెలలో కూడా ఆరుతడి పంటలు వేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్ నెలలో సాగు చేసే పంటల ఎంపిక రైతుల ఆర్థిక స్థితిగతులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. నిపుణుల సమాచారం ప్రకారం.. ఆగస్టు నెల చివరి నుంచి సెప్టెంబర్ నెల వరకు అధిక లాభాలు, దిగుబడులు సాధించడానికి అనువైన కొన్ని పంటలను ఎంపిక చేసుకోవచ్చు. వాటి వివరాలు, సాగు పద్ధతులపై ఈ కథనంలో సమగ్రంగా తెలుసుకుందాం..
సెప్టెంబర్ పంటలు – అధిక దిగుబడి కోసం ఎంచుకోవాల్సిన పంటలు
శనగ సాగు పద్దతులు:
సెప్టెంబర్ నెలలో శనగ పంటను చాలా మంది రైతులు ఎంపిక చేసుకుంటారు. ఈ పంట ఎకరానికి సుమారు 7 నుండి 10 క్వింటాళ్ల వరకు దిగుబడిని ఇవ్వగలదని చెబుతున్నారు. అయితే, శనగ పంటను పందుల బెడద నుండి కాపాడుకోవడం ఒక సవాలుగా పరిగణించబడుతుంది. దీనికి తగిన రక్షణ చర్యలు తీసుకోవడం అవసరం.
పెసర సాగు:
పెసర పంట కూడా అధిక దిగుబడిని, మంచి రాబడిని అందించే పంటలలో ఒకటి. ఇది ఎకరానికి దాదాపు 6 నుండి 7 క్వింటాళ్ల వరకు దిగుబడిని ఇస్తుంది, కొన్ని చోట్ల 8 క్వింటాళ్ల వరకు కూడా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అనువైన నేల.. పెసర సాగులో పలు బెడదలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధిక దిగుబడి పొందడానికి మంచి రకాల విత్తనాలను ఎంపిక చేసుకోవడం, ఒకటి లేదా రెండు తడులు నీటిని అందించడం (లేదా వర్షాలు అనుకూలిస్తే అవసరం ఉండదు), అవసరమైన రసాయన మందులను స్ప్రే చేయడం ముఖ్యం.
మినుము సాగు:
మినుము పంట కూడా పెసర మాదిరిగానే అధిక లాభాలను అందించే అవకాశం ఉంది. దిగుబడి పరంగానూ, సాగు పద్ధతుల పరంగానూ ఇది పెసరను పోలి ఉంటుంది.
నువ్వుల సాగు:
నువ్వుల పంట సాధారణంగా లాభదాయకమైనదే అయినప్పటికీ, సెప్టెంబర్ నెలలో సాగు చేయడానికి అంత అనుకూలం కాదు. ఈ సమయంలో వేసిన నువ్వులకు చలికాలం ప్రభావం ఎక్కువగా ఉంటుంది, దీని వల్ల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. సెప్టెంబర్లో వేస్తే దిగుబడి తగ్గుతుంది.
మొత్తంగా.. సెప్టెంబర్ నెలలో శనగ, పెసర, మినుము వంటి పంటల సాగు లాభదాయకంగా ఉంటుందని, నువ్వులను మాత్రం జనవరిలో వేయడం ఉత్తమం అని వ్యవసాయ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. అయితే.. రైతులు తమ ప్రాంత వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, మార్కెట్ డిమాండ్ను పరిగణనలోకి తీసుకొని పంటలను ఎంపిక చేసుకోవడం మంచిది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
