పేవ్ మెంట్లపైనే నిద్రిస్తున్న కోవిడ్ రోగులు, కర్నాటక లోని బీదర్ జిల్లాలో దారుణం
కోవిడ్ రోగులు కొందరు పేవ్ మెంట్లపైనే నిద్రిస్తున్న దయనీయ దృశ్యమిది... కర్ణాటక బీదర్ జిల్లాలోని మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో తగినన్ని బెడ్లు లేకపోవడంతో గత్యంతరం, లేక కొంతమంది పేషంట్లు...
కోవిడ్ రోగులు కొందరు పేవ్ మెంట్లపైనే నిద్రిస్తున్న దయనీయ దృశ్యమిది… కర్ణాటక బీదర్ జిల్లాలోని మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో తగినన్ని బెడ్లు లేకపోవడంతో గత్యంతరం, లేక కొంతమంది పేషంట్లు ఫుట్ పాత్ పైనే నిద్రిస్తున్నారు. ఈ హాస్పిటల్ బయట రోజంతా వేచి చూసినా ఫలితం లేకపోవడంతో వారిలా పేవ్ మెంట్ బాట పట్టారు. బీదర్ జిల్లాలో కరోనా వైరస్ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ తెలిపారు. బుధవారం ఒక్కరోజే జిల్లాలో 202 కేసులు నమోదు కాగా 5 గురు రోగులు మరణించారన్నారు. జిల్లాలో ఈ ఆసుపత్రి చాలా పెద్దదని, ఏమైనా బెడ్ల కొరత వంటి పరిస్థితిని అధిగమించడానికి యత్నిస్తున్నామని ఆయన చెప్పారు. సాధ్యమైనంత వరకు త్వరలో వీరికి ఈ ఆసుపత్రిలో పడకలు లభించేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే బెడ్ల కొరత లేదని, పాత ఆసుపత్రిలో 450 , కొత్త హాస్పిటల్ లో 100 బెడ్లు ఉన్నాయని ఈ జిల్లా డిప్యూటీ కమిషనర్ రామచంద్రన్ తెలిపారు. ఓ సంస్థకు చెందిన కొంతమంది లేనిపోని వదంతులు సృష్టిస్తున్నారని, వారిని గుర్తించి వారిపై లీగల్ చర్య తీసుకుంటామని ఆయన చెప్పారు.
కర్ణాటకలో కోవిడ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అనేక జిల్లాలు ఈ కేసులతో సతమతమవుతున్నాయి. కోవిడ్ మృతుల దేహాలను దహనం లేదా ఖననం చేయడానికి కూడా శ్మశానాల్లో స్థలం లేకపోతోంది.