కేరళ ప్రభుత్వంపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం !
కేరళలో సీఎం పినరయి విజయన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సోమవారం అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతామని ప్రతిపక్షనేత రమేష్ చెన్నితాల ప్రకటించారు.
కేరళలో సీఎం పినరయి విజయన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సోమవారం అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతామని ప్రతిపక్షనేత రమేష్ చెన్నితాల ప్రకటించారు. కోవిడ్ పేరిట రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. (అయితే కోవిడ్ మహమ్మారి గత మార్చి నుంచే ప్రబలమైన విషయం గమనార్హం).సీఎం విజయన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లైఫ్ మిషన్ పేరిట చేపట్టిన ఇళ్ల నిర్మాణ పథకం కింద అవినీతి జరిగిందని, ఈ ప్రాజెక్టు కోసమంటూ 4.25 కోట్ల నిధుల కేటాయింపు జరిగినా.. నిధుల మళ్లింపు జరిగినట్టు సీఎం ప్రెస్ అడ్వైజర్, ఇద్దరు మంత్రులు సైతం అంగీకరించారని రమేష్ చెన్నితాల తెలిపారు.
అయితే రాష్ట్రాన్ని కుదిపివేస్తున్న గోల్డ్ స్మగ్లింగ్ కేసును పక్కన పెట్టి లైఫ్ మిషన్ పథకం కింద జరిగిన అవినీతిపై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే యోచన చేయడమేమిటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై తాము శాసన సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఇదివరకే ప్రతిపక్షాలు ప్రకటించాయి. కాగా-సోమవారం రోజంతా సుదీర్ఘ సమయం శాసనసభా కార్యకలాపాలు జరగనున్నాయి. బహుశా ఆ స నందర్భంగా విపక్షాలు ఈ అంశంపై విజయన్ ప్రభుత్వాన్ని ఇరకాటాన పెట్టవచ్చు.