NEET Result row: నీట్ వివాదం.. దేశవ్యాప్తంగా రోడ్డెక్కుతున్న ప్రతిపక్షాలు, విద్యార్థులు
నీట్ ఎగ్జామ్ వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుని దేశాన్ని కుదిపేస్తోంది. ప్రతిపక్షాలు నిరసన గళాన్ని అందుకున్నాయి. విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. సుప్రీంకోర్ట్ వరకూ ఈ వివాదం వెళ్లింది.
నీట్లో అవకతవకలు జరిగాయంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇండియా కూటమి పక్షాలన్నీ ఆందోళనకు దిగుతున్నాయి. ఢిల్లీ వీధుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ధర్నా చేస్తే.. హైదరాబాద్లోనూ విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. నీట్ ఎగ్జామ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు స్టూడెంట్ మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్లో వేలాది మంది విద్యార్థులు కదం తొక్కారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. విద్యార్థులకు జరిగిన అన్యాయంపై ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని MLC బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలన్నారు.
అటు BRSV ఆధ్వర్యంలోనూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. రాజ్భవన్ ముట్టడికి యత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
మరోవైపు.. నీట్ పరీక్షలో అవకతవకలపై కేంద్రంతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్ట్ నోటీసులు ఇచ్చింది. ఆరోపణలపై 2 వారాల్లో జవాబు చెప్పాలని ఆదేశించింది. పరీక్ష నిర్వహణలో తప్పులు ఒప్పుకుని, సరిదిద్దాలనీ.. 0.001 శాతం నిర్లక్ష్యం ఉన్నా NTAచర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణ జులై 8కి వాయిదా వేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..