AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New CDS: భారత సాయుధ త్రివిధ దళాల కొత్త అధిపతి ఎవరు? అప్పుడే మొదలైన చర్చ!

భారత సాయుధ త్రివిధ దళాల అధిపతి, చీఫ్ ఆఫ్ ఆర్మీ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ హ‌ఠాన్మ‌ర‌ణం యావత్ దేశాన్ని క‌లిచివేసింది.

New CDS: భారత సాయుధ త్రివిధ దళాల కొత్త అధిపతి ఎవరు? అప్పుడే మొదలైన చర్చ!
Cds Of India
Balaraju Goud
|

Updated on: Dec 08, 2021 | 9:46 PM

Share

New Chief of Defence Staff of India: భారత సాయుధ త్రివిధ దళాల అధిపతి, చీఫ్ ఆఫ్ ఆర్మీ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ హ‌ఠాన్మ‌ర‌ణం యావత్ దేశాన్ని క‌లిచివేసింది. బుధవారం నాడు ఆయన ప్రయాణించిన ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడు నీల‌గిరి కొండ‌ల్లోని కూనూరు సమీపంలో కుప్పకూలడంతో సీడీఎస్, ఆయన భార్య మధులికా, ఆర్మీ ఉన్నతాధికారులతో సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు. అయితే, హెలికాప్టర్ లో ప్రయాణించిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే తీవ్ర గాయాలతో బయటపడి చికిత్స పొందుతున్నారు. దేశ ప్రతిష్టకు, సాయుధ బలగాలకు నేతృత్వం వహించేది కావడంతో చీఫ్ ఆఫ్ ఆర్మీ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పదవిని ఎక్కువ కాలం ఖాళీగా ఉంచే వీలుండదు. విషాదకర సమయాల్లోనూ బలగాలు విధి నిర్వహణలో రాజీపడరాదనే సూత్రాన్ని అనుసరిస్తూ జనరల్ బిపిన్ రావత్ వారసుడి ఎంపికపై కేంద్రం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిసింది.

అయితే త‌దుప‌రి సీడీఎస్ గా ఎవ‌రిని నియ‌మిస్తారు? అస‌లు ఈ సీడీఎస్ ప‌ద‌వి విష‌యంలో కేంద్రం ఏం చేస్తుంద‌న్న ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి. త‌దుప‌రి సీడీఎస్‌ను కేంద్రం నియ‌మిస్తుందా? లేదంటే రాష్ట్ర‌ప‌తి విశేషాధికారాల్లో దీనిని క‌లిపేస్తుందా? ఏం చేస్తుంద‌న్న దానిపై ఆస‌క్తి నెల‌కొంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నేతృత్వంలోని భద్రతపై కేబినెట్ కమిటీ (సిసిఎస్) బుధవారం సమీక్షించినట్లు సమాచారం. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరయ్యారని అధికారిక వర్గాలు తెలిపాయి.

రక్షణ విషయంలో రాజీ కూడదన్న విషయంలో కేబినెట్ కమిటీ చర్చించినట్లు తెలుస్తోంది. త్రివిధ ద‌ళాలకు చెందిన ఏదో ఒక ద‌ళంలో విశేష సేవ‌లందించి, అనుభ‌వం గ‌డించిన మాజీ అధికారికి ఈ బాధ్య‌త‌లు అప్ప‌జెబుతారా? అన్న ప్ర‌శ్న కూడా ఉద‌యిస్తోంది. అయితే సైన్యంలోని కొంద‌రు సీనియ‌ర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ప‌ద‌వి దేశ ర‌క్ష‌ణ‌తో ముడిప‌డి ఉంటుంది కాబ‌ట్టి, ఈ ప‌ద‌విని కొత్త వ్య‌క్తికే అప్ప‌జెబుతార‌ని పేర్కొంటున్నారు. దేశ సేవలో అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని సమర్థవంతమైన నాయకుడిని ఎంపిక చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆర్మీలోని సీనియ‌ర్ అధికారులు సీడీఎస్‌గా ఎవ‌ర్ని నియ‌మించాల‌న్న‌ది ఇప్పుడు కత్తిమీద సాములా మారింది.

భార‌త తొలి సీడీఎస్ బిపిన్ రావ‌తే. అంతకుముందు వాయుసేన, ఆర్మీ, నేవీకి వేరువేరుగా అధిపతులు ఉండేవారు. ఈ దళాల మధ్య మరింత సమన్వయం కోసం సీడీసీ పదవిని సృష్టించడం జరిగింది. ఈ పదవిలో తొలిగా నియమితులైన వ్యక్తి బిపిన్ రావత్.. 2020 జనవరి 1 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ , ఆయన భార్య మధులిక ఆర్మీ సిబ్బంది సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకున్నారు. రావత్ దంపతులు తమ స్వస్థలం ఉత్తరాఖండ్‌లో కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. దేశసేవలో చనిపోయిన జవాన్ల కుటుంబాలను ఆదుకోవడానికి కూడా మధులిక అనేక కార్యక్రమాలను చేపట్టారు. ఉత్తరాఖండ్‌ లోని మారుమూల గ్రామం నుంచి ఆయన అత్యున్నత పదవిని చేపట్టారు.

ప్రపంచంలోని అగ్ర దేశాల మాదిరిగానే భారత్ లోనూ త్రివిధ దళాలకు అధిపతిగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) ఉండాలనే ప్రతిపాదన దశాబ్దాల కిందటే చేసినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోడీ పాలన చేపట్టాకే అధి సాధ్యమైంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉంచిన సీడీఎస్ పదవిని 2019లో సృష్టించారు ప్రధాని మోడీ. దీంతో ఆర్మీ చీఫ్ నుంచి భారత్ కు తొలి సీడీఎస్ గా బిపిన్ రావత్ నియమితులయ్యారు. త్రివిధ దళాలకు సంబంధించి సీడీఎస్ అత్యున్నత పదవికాగా, రెండో అత్యున్నత పోస్టుగా వైస్ సీడీఎస్ ను సైతం సృష్టించడం తెలిసిందే. తొలి వైస్ సీడీఎస్ గా వ్యవహరించిన వైస్ అడ్మిరల్ హరి కుమార్ ఈ వారంలోనే నేవీ చీఫ్ గా నియమితులయ్యారు. రెండో వైఎస్ సీడీఎస్ గా పనిచేసిన వైఎస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ రిటైర్మెంట్ పొందారు. ప్రస్తుతం వైఎస్ సీడీఎస్ గా ఎయిర్ మార్షల్ బలభద్ర రాధాక‌ృష్ణ(బీఆర్ కృష్ణ) కొనసాగుతున్నారు.

సీడీఎస్ బిపిన్ రావత్ మరణంతో వైఎస్ సీడీఎస్ బలభద్ర రాధాకృష్ణనే అత్యున్నత పదవిలో ఉన్నట్లయింది. కాగా, వైఎస్ సీడీఎస్ బీఆర్ కృష్ణనే సీడీఎస్ గా నియమించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రావత్ ఉత్తరాదికి చెందినవారు కాగా, రాధాకృష్ణ దక్షిణాదికి చెందినవారు కావడం విశేషం. వెల్లింగ్టన్ డిఫెన్స్ సర్వీసెస్ కాలేజీ నుంచే బీఆర్ కృష్ణ తన ప్రస్థానం ప్రారంభించి వైఎస్ సీడీఎస్ స్థాయికి ఎదిగారు. అయితే సీడీఎస్ గా ఎవరిని నియమించాలనేది కేంద్రం ప్రాధాన్యంతలను బట్టి ఉంటుందని రక్షణ నిపుణులు చెబుతున్న మాట. వైస్ సీడీసీ బీఆర్ కృష్ణతోపాటు ప్రస్తుత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే పేరును సైతం సీడీఎస్ పోస్టుకు కేంద్రం పరిశీలించినట్లు వినికిడి. అదీగాక ఎయిర్ ఫోర్స్, నేవీలో పనిచేసిన అధికారుల కంటే ఆర్మీలో పనిచేసిన వారినే సీడీఎస్ పదవి వరించడం చాలా దేశాల్లో జరుగతుంది. భారత కొత్త సీడీఎస్ ఎవనేదానిపై ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలు, వ్యాఖ్యలు వెలువడలేదు. అత్యంత కీలకమైన ఈ నియామకాలకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. అప్పటిదాకా కొత్త సీడీఎస్ ఎవరనేది వేచి చూడాల్సిందే.

Read Also…  CDS Bipin Rawat: భారతీ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మృతి పట్ల యావత్ దేశం దిగ్భ్రాంతి.. స్మరించుకున్న ప్రముఖులు

Follow Us