Assam Police: మళ్లీ అదే రచ్చ.. అదే ఆందోళన.. అసోం పోలీసుల.. నిరసనకారుల మధ్య భీకర యుద్ధం
అసోం అట్టుడికింది. నిరసనకారులు.. పోలీసుల మధ్య భీకర యుద్ధం నడిచింది. ధోల్పూర్లో జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇటీవల ధోల్పూర్లో అక్రమంగా నిర్మించుకున్నారంటూ..
అసోం అట్టుడికింది. నిరసనకారులు.. పోలీసుల మధ్య భీకర యుద్ధం నడిచింది. ధోల్పూర్లో జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇటీవల ధోల్పూర్లో అక్రమంగా నిర్మించుకున్నారంటూ పలు ఇళ్లను ఖాళీ చేయిస్తోంది ప్రభుత్వం. 2 గ్రామాల్లోని 800 ఇళ్లు, 3 మసీదుల్ని ఖాళీ చేయించడంతో వివాదం మొదలైంది. తాజాగా మరోసారి ప్రభుత్వాధికారులు ఇళ్లు ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. గత కొన్ని రోజులుగా ఇళ్లను ఖాళీ చేయించే డ్రైవ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ చర్యల్ని నిరసిస్తూ బాధితులు ఆందోళనకు దిగారు. బాధితులు ఎదురుతిరగడంతో పోలీసులు కన్నెర్రజేశారు.
ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపారు పోలీసులు. ఒకదశలో నిరసనకారులపై లాఠీలు ఝుళిపించారు. పోలీసులు కాల్పులకు దిగడంతో ఇద్దరు చనిపోయారు. అనేకమంది గాయాలపాలయ్యారు. ఈ ఘర్షణలో పలువురు పోలీసులకు సైతం గాయాలయ్యాయి.
సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని కేబినెట్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ధోల్పూర్లో నివాసాలు ఏర్పర్చుకున్న భూమిని రాష్ట్ర వ్యవసాయ ప్రాజెక్టు కోసం సేకరించాలని నిర్ణయం తీసుకుంది. పోలీసుల సాయంతో వందలాది ఇళ్లను ఖాళీ చేయించారు అధికారులు.
తాజాగా మరోసారి ఇళ్లను ఖాళీ చేయించేందుకు పూనుకున్నారు అధికారులు. అయితే ఈసారి బాధితులు తిరగబడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటనా స్థలం రణరంగాన్ని తలపించింది. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ.
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ కుట్రేనని.. ప్రభుత్వమే దాడికి ఉసిగొల్పిందని ఆరోపించారు రాహుల్. ఈ పరిస్థితి మరెవరికీ రాకూడదన్నారు. అసోం కాంగ్రెస్ ప్రెసిడెంట్ భూపేన్ కుమార్ బోరా కూడా పోలీసుల చర్యల్ని ఖండించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టింది. కొవిడ్ సంక్షోభ సమయంలో ఈ చర్య సరికాదని హితవు పలికింది.
ఇవి కూడా చదవండి: Bats with Covid: అక్కడి గబ్బిలాల్లో మరో కొత్త వైరస్.. ఈజీగా వ్యాపిస్తుందంటున్న పరిశోధకులు..
Stock market update: బుల్ రంకెలేసింది.. రికార్డుల మోత మోగించింది.. ఇన్వెస్టర్లలో లాభాల పంట..
రోడ్డు పై స్విమ్మింగ్ పూల్.. బురద నీటిలో శవాసనం.. అతనెవరో తెలిస్తే షాక్ అవుతారు..