
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం మరోసారి పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కోబోతున్నారా..? ఆ కష్టాలకు కారణం స్వయాన ఆయన కొడుకు.. ప్రస్తుతం థేని ఎంపీగా ఉన్న రవీంద్రనాథేనా..? అంటే అవుననే చెప్పక తప్పదు. తాజాగా ఆ ఎంపీ.. తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఓ మహిళ సాక్షాత్తు డీజీపీకే ఫిర్యాదు చేయడం ప్రకంపనలు రేపుతోంది. ఈ మధ్యకాలంలో దేశంలోని కొందరు నేతల కామ క్రీడలు రచ్చకెక్కి రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నారు. అక్కడా, ఇక్కడా అనే తేడా లేకుండా పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆడియో, వీడియోలతో అడ్డంగా బుక్కైపోతున్నారు. ఇలాంటి దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. అందులోనూ.. అధికార పార్టీకి చెందిన నేతాశ్రీలు.. స్త్రీలోలులుగా మారి పరువు తీసుకుంటున్నారు.
తాజాగా.. తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం కుమారుడు, అన్నాడీఎంకే నేత, థేనీ ఎంపీ రవీంద్రనాథ్పై పెద్దయెత్తున ఆరోపణలు వస్తున్నాయి. రవీంద్రనాథ్పై తాజాగా ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. కోరిక తీర్చాలంటూ ఎంపీ రవీంద్రనాథ్ తనను వేధిస్తున్నారంటూ డీజీపీకి ఓ మహిళ ఫిర్యాదు చేయడం తమిళనాట రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. గత ఏడాది అక్టోబర్ నుంచి వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
శివగంగై జిల్లా కారైకుడి చెందిన ఆమె.. 2020లో భర్తకు విడాకులు ఇచ్చి ఇద్దరు పిల్లలతో జీవిస్తోంది. గత పదేళ్లుగా రవీంద్రనాథ్ కుటుంబంతో ఆమె కుటుంబానికి సత్సంబధాలున్నాయి. ఈ చనువును అదనుగా తీసుకొని తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని, అర్థరాత్రి వీడియో కాల్స్ చేసి న్యూడ్గా కనిపించాలని.. చేయకుంటే చంపేస్తానని బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించింది.
అయితే.. గతంలో తాంబారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు ఏకంగా డీజీపీకి ఫిర్యాదు చేయడంతో.. కేసును దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. ఇప్పటికే.. రవీంద్రనాథ్ 2019 ఎన్నికల అఫిడవిట్కు సంబంధించి వివాదంలో ఉన్నారు. మొత్తంగా.. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు ఓ మహిళ ఆరోపణలు చేయడంతో ఎంపీ రవీంద్రనాథ్ మరోసారి ఇరకాటంలో పడ్డారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..