AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

George Soros: ఎవరా జార్జ్‌ సోరోస్‌..? ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఇంతకీ అసలు ఏమన్నారంటే..

జార్జ్ సోరోస్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి మంత్రి స్మృతి ఇరానీ స్పందిస్తూ.. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను ధ్వంసం చేసి, ఆర్థిక నేరగాడిగా ముద్రపడిన వాడు ఇప్పుడు..

George Soros: ఎవరా జార్జ్‌ సోరోస్‌..? ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఇంతకీ అసలు ఏమన్నారంటే..
George Soros
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 17, 2023 | 7:46 PM

Share

హంగేరియన్-అమెరికన్ మూలాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త జార్జ్ సోరోస్ మరోసారి భారత్ అంతర్గత విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ గ్రూపుపై అమెరికా పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌ నివేదిక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో జార్జ్‌ సోరోస్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అదానీ వ్యవహారం భారత్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు దారితీస్తుందని.. దీనిపై భారత ప్రధాని మోదీ పార్లమెంటులో జవాబు చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా మండిపడుతోంది. ఈ తరుణంలో కేంద్రమంత్రి మంత్రి స్మృతి ఇరానీ స్పందిస్తూ.. ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను ధ్వంసం చేసి, ఆర్థిక నేరగాడిగా ముద్రపడిన వాడు ఇప్పుడు భారత ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయాలని భావిస్తున్నాడు’ అని అన్నారు. అయితే భారత్‌తో ఎటువంటి సంబంధం లేని జార్జ్ సోరోస్ మన దేశ వ్యవహారాలలో ఎందుకు పదే పదే తలదూరుస్తున్నాడే వివరాల గురించి ఇప్పుడు చూద్దాం..

నకిలీ ఐడీ కార్డులతో..

ప్రముఖ వ్యాపారవేత్తగా పేరొందిన హంగేరియన్‌- అమెరికన్‌ మూలలకు చెందిన జార్జ్‌ సోరోస్‌(92) ప్రపంచ కుబేరుల్లో ఒకరు. 1930లో హంగేరీలోని యూద కుటుంబంలో జన్మించిన జార్జ్ సోరోస్ నాజీల దౌర్జన్యాన్ని చవిచూశాడు. అయితే సోరోస్, అతని కుటుంబం నకిలీ ID రుజువులను చూపించడం ద్వారా నాజీల బారి నుంచి తప్పించుకోగలిగారు. ఈ కారణాల వల్ల అతను ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదలకు సహాయం చేసే వ్యక్తిగా మారాలని కోరుకున్నాడు. హంగేరిలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అతను తన కుటుంబంతో కలిసి 1947లో లండన్‌కు వెళ్లాడు. అక్కడ లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో ఫిలాసఫీ చేసిన ఆయన.. కొంతకాల రైల్వే స్టేషన్‌లో పోర్టర్‌గా.. యూరోపియన్‌ సెక్యురిటీస్‌లో అనలిస్టుగా పనిచేశారు. తర్వాత 1956లో అమెరికాకు వెళ్ళాడు.

దిగ్గజ ఇన్వెస్టర్‌గా ఎదిగి..

జార్జ్ సోరోస్ 1973లో హెడ్జ్‌ ఫండ్‌ను స్థాపించి భారీ పెట్టుబడులతో ప్రపంచ మార్కెట్లలో ప్రముఖ స్థానం సంపాదించుకున్నాడు. అనతి కాలంలోనే అమెరికా చరిత్రలోనే విజయవంతమైన ఇన్వెస్టర్‌గా కూడా ఎదిగారు. 1969- 2011 మధ్య కాలంలో ఆయన సంపద భారీగా పెరిగిపోయింది. 8.6 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఎదిగిన ఆయన.. ప్రజాస్వామ్యం, పారదర్శకత, భావప్రకటన స్వేచ్ఛను ప్రోత్సహించే వ్యక్తులు, సంస్థలకు నిధులు అందిస్తున్నారు. ఓపెన్‌ సొసైటీ ఫౌండేషన్స్‌ ద్వారా మానవ హక్కుల పరిరక్షణ కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం 70కిపైగా దేశాల్లో ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

ట్రంప్‌, జిన్‌పింగ్‌ లేకుంటేనే..

జార్జ్ సోరోస్‌‌కు రాజకీయాల్లోనూ భాగస్వామ్యం ఉంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో బరాక్‌ ఒబామా, హిల్లరీ క్లింటన్‌, జో బైడెన్‌లకు మద్దతు ప్రకటించాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, తుర్కియే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్దోగాన్‌లకు వ్యతిరేకంగా పలు సందర్భాల్లో ఆయన మాట్లాడారు. ట్రంప్‌, జిన్‌పింగ్‌లు నిరంకుశ పాలన చేస్తున్నారని.. వారే లేకుంటే ప్రపంచ ఎంతో మెరుగ్గా ఉండేదని కొన్నేళ్ల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అందుకే ఆయనపై.. కన్జర్వేటీవ్ ప్రభుత్వాలకు జార్జ్ సోరోస్ వ్యతిరేకమని, ఆ ప్రభుత్వాలు ఏ దేశంలో ఉంటే అక్కడకు వెళ్లి అంతర్గత విషయాలలో తల దూరుస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

మోదీపై గతంలోనూ..

ట్రంప్‌, జిన్‌పింగ్‌ వంటి నేతలతోపాటు భారత ప్రధాని నరేంద్ర మోదీపైనా జార్జ్‌ సోరోస్‌ గతంలో విమర్శలు గుప్పించారు. 2020లో ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన.. కశ్మీర్‌లో కఠిన చర్యలు తీసుకుంటున్నారని, ముస్లిం పౌరులను తమ పౌరసత్వానికి దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మోదీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా జర్మనీలోని మ్యునిచ్‌లో జరుగుతోన్న భద్రతా సమావేశంలో మాట్లాడిన ఆయన.. అదానీ వ్యవహారం కారణంగా ప్రభుత్వంపై మోదీకి ఉన్న పట్టు సడలుతుందని అన్నారు. తాను అమాయకుడిని కావచ్చేమో కానీ, భారత్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణను ఆశిస్తున్నానన్నారు.

భాజపాకు మద్దతుగా కాంగ్రెస్‌..

సోరోస్‌ వ్యాఖ్యలను భాజపా తీవ్రంగా ఖండించింది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేసేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నుతున్నాయని, సోరోస్‌ కూడా లక్ష్యంగా చేసుకున్నారని మండిపడింది. మరోవైపు కాంగ్రెస్‌ కూడా ఇదే విధంగా స్పందించింది. అదానీ వ్యవహారం భారత్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ దారితీస్తుందా..? అనేది కాంగ్రెస్‌, ప్రతిపక్ష పార్టీలతోపాటు ఇక్కడి ఎన్నికలపై ఆధారపడి ఉంటుందని.. దానికి జార్జ్‌ సోరోస్‌కు ఏం సంబంధమని ప్రశ్నించింది. సోరోస్‌ వంటి వ్యక్తులు భారత్‌లో ఎన్నికల ఫలితాలను నిర్ధారించలేరని స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us