Cholera Outbreak: ఆ రాష్ట్రంలో పెరుగుతున్న కలరా వ్యాప్తి.. నీటిలో బాక్టీరియా గుర్తింపు.. 8 మంది మృతి.. 120 మందికి చికిత్స
ఒడిశాలోని రాయగడ జిల్లాలో కలరా విజృంభిస్తోండడంతో.. అధికారులు చికిత్స నిమిత్తం చర్యలు చేపట్టారు. కాశీపూర్లోని మండిపిసి, దంగలిసి గ్రామాల్లో రెండు తాత్కాలిక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.
Cholera Outbreak: వర్షాలు, వరదల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విజృంభించడం మొదలు పెట్టాయి. ఒడిశాలోని రాయగడ జిల్లాలో కలరా వ్యాధి విజృంభిస్తోంది. ని కాశీపూర్ బ్లాక్లో ఇప్పటికే ఎనిమిది మంది కలరాతో మరణించారు. భారీ సంఖ్యలో చికిత్స పొందుతున్నారు. నీటి ద్వారా సంక్రమించిన బ్యాక్టీరియాతో వ్యాధి బారిన పడినట్లు తెలుస్తోంది. కాశీపూర్లోని 8 పంచాయతీల్లో ఆరింటిలో భారీగా కలరా కేసులు నమోదయ్యాయి. 120 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దుడుకబహల్ పంచాయతీలో 65 మందికి, తికిరి పంచాయతీలో 48 మందికి వ్యాధి సోకింది. నకతిగూడ పంచాయతీ సనమతికాన గ్రామానికి చెందిన దాల్మీ మాఝీ (60) అనే వృద్ధురాలు కలరా వ్యాధితో ఇటీవల మృతి చెందింది. సోమవారం రాత్రి కడుపునొప్పి, లూజ్ మోషన్స్తో బాధపడింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
నీటిలో వెలుగులోకి వచ్చిన బాక్టీరియా: రాయగడ జిల్లా కలెక్టర్ స్వధా దేవ్ సింగ్ , భువనేశ్వర్లోని ప్రాంతీయ వైద్య పరిశోధనా కేంద్రం (RMRC) వైద్యుల బృందం డాక్టర్ బిభూతి భూషణ్ పాల్ నేతృత్వంలో గ్రామానికి చేరుకున్నారు. పది నమూనాలను పరీక్షించారు. ఈ నమూనాల్లో విబ్రియో కలరే బ్యాక్టీరియా ఉన్నట్లు పరిశోధనల్లో తెలిసింది. అంతేకాదు కాశీపూర్ బ్లాక్ నుండి సేకరించిన నీటి నమూనాలలో కూడా బ్యాక్టీరియా వెలుగులోకి వచ్చింది.
చికిత్స కోసం వైద్య శిబిరాలు కలరా విజృంభిస్తోండడంతో.. అధికారులు చికిత్స నిమిత్తం చర్యలు చేపట్టారు. కాశీపూర్లోని మండిపిసి, దంగలిసి గ్రామాల్లో రెండు తాత్కాలిక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇదే విషయంపై రాయగడ కలెక్టర్ స్వధా దేవ్ సింగ్ మాట్లాడుతూ.. 104 క్రియాశీల కేసులు ఉన్నాయని.. బాధితులకు చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజారోగ్య కేంద్రాలను వికేంద్రీకరించి.. బాధితులను చికిత్సను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో (CHC) బాధితులకు చికిత్సని అందిస్తున్నారు. రోగులకు చికిత్స చేయడానికి వైద్య సేవను నాలుగు విభాగాలుగా విభజించినట్లు పేర్కొన్నారు. గుగుపుట్, డెంగాగూడ, రామగూడ గ్రామాల్లో మూడు మొబైల్ హెల్త్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు కలెక్టర్ స్వధా దేవ్ సింగ్. అంతేకాదు బ్యాక్టీరియా కనిపించిన ప్రాంతాల్లో ట్యాంకర్తో నీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు.
మరోవైపు ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు రోగులను ముందస్తుగా గుర్తించడం కోసం ఇంటింటికీ స్క్రీనింగ్ చేస్తున్నారు. ప్రభావిత గ్రామాల్లో మందులు పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో అవగాహన డ్రైవ్లని చేపట్టారు. అత్యవసర అవసరాల కోసం హెల్ప్లైన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ నిరంజన్ మిశ్రా మాట్లాడుతూ.. ” ప్రస్తుతం కలరా బాధితులకు చికిత్సను అందించడమే తమ ప్రాధాన్యత అని.. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..