పంజాబ్లో టెన్షన్.. టెన్షన్.. హింసాత్మకంగా మారిన నిరసనలు.. 30 మంది పోలీసులకు గాయాలు..
సిక్కు ఖైదీలను విడుదల చేయాలని కోరుతూ చేపట్టిన నిరసనలు పంజాబ్లో బుధవారం హింసాత్మకంగా మారాయి. మొహలీలో జరిగిన ఈ ఘర్షణల్లో దాదాపు 30 మంది పోలీసులు గాయపడ్డారు.
సిక్కు ఖైదీలను విడుదల చేయాలని కోరుతూ చేపట్టిన నిరసనలు పంజాబ్లో బుధవారం హింసాత్మకంగా మారాయి. మొహలీలో జరిగిన ఈ ఘర్షణల్లో దాదాపు 30 మంది పోలీసులు గాయపడ్డారు. అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిక్కు ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిక్కులు నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఆందోళనకారులు బుధవారం చండీగఢ్లోని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ అధికారిక నివాసానికి చేరుకోవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు చండీఘడ్ – మొహలీ సరిహద్దుల్లో ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. ఆందోళనకారులు ఒక్కసారిగా కర్రలు, కత్తులు పోలీసులపై దాడి చేశారని.. వాహనాలను కూడా ధ్వంసం చేశారని అధికారులు తెలిపారు.
నిరసనల నేపథ్యంలో ముందే అప్రమత్తమైన పంజాబ్ పోలీసులు మాన్ నివాసం వైపు వెళ్లకుండా చండీగఢ్-మొహాలీ సరిహద్దు దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే, నిరసనకారులు బారికేడ్లను చేధించి బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో చండీగఢ్ పోలీసులు నీటి ఫిరంగులను ఉపయోగించినా ఫలితం లేకుండా పోయింది. క్వామీ ఇన్సాఫ్ మోర్చా అనే బ్యానర్తో నిరసనకారులు పోలీసు సిబ్బంది, ఆస్తులపై హింసాత్మక దాడి చేశారని PTI నివేదించింది.
నిరసనకారులు అకస్మాత్తుగా పోలీసులపై దాడికి దిగారని.. అధికారులు తెలిపారు. వాటర్ ఫిరంగి వాహనం, అల్లర్ల నియంత్రణ వాహనం, రెండు జీపులు, అగ్నిమాపక వాహనాన్ని ధ్వంసం చేశారని.. ఈ దాడిలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో సహా 30 మంది సిబ్బంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..