Viral: ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు.. బయటపడ్డ మట్టి కుండ.. ఏముందోనని చూడగా కళ్లు జిగేల్!
పురాతన ఇంటిని కూలగొట్టి.. తవ్వకాలు జరుపుతుండగా.. కొందరు కూలీలు కనిపించిన దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. వారికి ఓ మట్టి కుండ దర్శనమిచ్చింది. అందులో ఏముందా అని చూడగా..
గుప్త నిధులు దొరికితే ఎవరైనా ఏం చేస్తారు.. వాటి దాచిపెట్టి గుట్టుచప్పుడు కాకుండా మాయమవుతున్నారు. కానీ ఓ దినసరి కూలీ చేసిన పనికి అందరూ శభాష్ అంటున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన కూలీ హల్లె అహిర్వార్ ఓ ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా.. బ్రిటిష్ కాలంనాటి వెండి నాణేలు బయటపడ్డాయి. వాటిని ఇంటికి తీసుకెళ్లి, తానే దాచుకోవాలని అనుకున్నారు. ఓ రాత్రంతా నిద్ర లేకుండా గడిపారు. చివరికి మానవత్వంతో ఆలోచించి.. వాటిని ప్రభుత్వానికి అప్పగించారు.
దమోహ్ జిల్లా బదల్పుర గ్రామానికి చెందిన హల్లె అహిర్వార్ ఓ పాత ఇంటి వద్ద తవ్వినపుడు 1887వ సంవత్సరంనాటి 240 వెండి నాణేలు దొరికాయి. వీటిని చూసిన హల్లె షాక్ అయ్యాడు. వాటిని తన వద్దనే ఉంచుకోవాలని మొదట భావించినప్పటికీ, చివరికి పోలీసులకు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. ఈ వెండి నాణేల విలువ సుమారు 2 లక్షల రూపాయల వరకు ఉండవచ్చునని తెలుస్తోంది. కొత్వాలీ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి విజయ్ రాజ్పుట్ హల్లె అహిర్వార్ను అభినందించారు. వెండి నాణేలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇదిలావుంటే, ఈ స్థలంలో నిర్మాణ పనులను నిలిపేయాలని అధికారులు ఆదేశించారు. ఈ స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఆర్కియాలజీ, మినరల్స్ శాఖల అధికారులను పిలిచారు. ఈ ఇంటి ఆవరణలోనే ఓ గుడి కూడా ఉండటంతో ఇక్కడ మరింత సంపద ఉండే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.