Alzheimer’s in Women: మహిళలనే టార్గెట్ చేస్తున్న మతిమరుపు.. అల్జీమర్స్ ముప్పు ఆడవారికే ఎందుకు ఎక్కువ?
వయసు పైబడిన వారిలో కనిపించే అతిపెద్ద ఆరోగ్య సమస్య అల్జీమర్స్ అయితే, ఈ వ్యాధి పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అల్జీమర్స్ బాధితుల్లో మూడింట రెండు వంతులు మహిళలే ఉండటం గమనార్హం. అసలు దీనికి కారణాలు ఏంటి? సైన్స్ ఏం చెబుతోంది?

మహిళల్లో హార్మోన్ల మార్పులు అల్జీమర్స్ ముప్పును పెంచుతాయి. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు పడిపోతాయి. మెదడు కణాలను రక్షించడంలో ఈస్ట్రోజెన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ హార్మోన్ తగ్గడం వల్ల మెదడులో మార్పులు సంభవించి మతిమరుపుకు దారితీసే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేకమైన జన్యువులు మహిళలపైనే ఎక్కువ ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా APOE-ε4 అనే జన్యువు ఉన్న మహిళల్లో, అదే జన్యువు ఉన్న పురుషుల కంటే అల్జీమర్స్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది.
సాధారణంగా పురుషుల కంటే మహిళలు ఎక్కువ కాలం జీవిస్తారు. అల్జీమర్స్ అనేది వయసుతో పాటు పెరిగే వ్యాధి. మహిళలు ఎక్కువ కాలం జీవించడం వల్ల వృద్ధాప్యంలో ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు కూడా సహజంగానే పెరుగుతున్నాయి. మహిళల మెదడులో గ్లూకోజ్ వినియోగం, శక్తి ఉత్పత్తి ప్రక్రియలు పురుషుల కంటే భిన్నంగా ఉంటాయి. మెనోపాజ్ దశలో మెదడుకు అందే శక్తి తగ్గడం వల్ల అమిలాయిడ్ ప్లాక్స్ వంటి వ్యర్థాలు మెదడులో పేరుకుపోయి జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తాయి.
అల్జీమర్స్ నుంచి తప్పించుకోవడానికి లేదా దాని తీవ్రతను తగ్గించడానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.దీనికోసం సరైన ఆహారం అవసరమని అంటున్నారు.మెదడు పనితీరును మెరుగుపరిచే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఆకుకూరలు తీసుకోవాలి.శారీరక శ్రమ మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది.సుడోకు, పజిల్స్ పూర్తి చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా మెదడును యాక్టివ్గా ఉంచాలి.డాక్టర్ల సలహాతో మెనోపాజ్ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అల్జీమర్స్ అనేది కేవలం వృద్ధాప్య సమస్య మాత్రమే కాదు, మహిళల విషయంలో ఇది హార్మోన్లు మరియు జన్యువుల కలయిక. అందుకే మహిళలు 40 ఏళ్ల నుంచే తమ మెదడు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




