పవిత్ర శ్రావణమాసంలో తీవ్ర విషాదం.. దైవ దర్శనానికి వెళ్లి వేర్వేరు ప్రాంతాల్లో 9 మంది భక్తులు మృతి
శ్రావణమాసంలోని పవిత్ర మూడో సోమవారం రోజున దేశంలో రెండు ఊహించని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రెండు రాష్ట్రాల్లోని ఆలయాల్లో అపశ్రుతి వెలుగు చూసింది. ఓ ఆలయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఆలయంలో జరిగిన గొడవలో ఇద్దరు భక్తులు మరణించారు.

కాంచీపురం అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన రెండు వర్గాలకు చెందిన భక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చిన్నగా మొదలైన గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో ఇరు వర్గాలు పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో ఇద్దరు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది దాకా గాయపడ్డట్టు తెలుస్తోంది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. బిహార్లో మరో విషాదం వెలుగు చూసింది. లఖిసరాయ్ జిల్లాలోని అశోక్ ధామ్ ఆలయంలో ఉదయం అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై ఒక్కసారిగా విద్యుత్ తీగలు తెగిపడడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆరుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. నేడు పవిత్ర శ్రావణ మాసంలోని మూడవ సోమవారం కావడంతో లఖిసరాయ్ జిల్లాలోని అశోక్ ధామ్ శివాలయానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయం ముందు భారీ సంఖ్యలో భక్తులు ప్రార్థనలు చేస్తుండగా ఉదయం 6:45 గంటల ప్రాంతంలో పక్కనే ఉన్న విద్యుత్ తీగలు తెగి భక్తులపై పడిపోయాయి. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన భక్తులు పరుగులు తీయడం ప్రారంభించారు. దీంతో అక్కడ తొక్కిసలాట ఏర్పడింది.
ఈ ప్రమాదంలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడగా.. ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై లఖిసరాయ్ జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్ మాట్లాడుతూ.. భారీ సంఖ్యలో ప్రజలు వస్తారని ముందే ఊహించి అన్ని ఏర్పాట్లు చేశామని, అయినప్పటికీ భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో ఓ కరెంటు స్తంభం విరిగి భక్తులపై పడినట్టు తెలిపారు. దానికి తోడు భక్తులకు బారికేడ్లు అడ్డుగా ఉండడంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట జరిగిందన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
