ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు వచ్చేస్తున్నాయ్.. ఈ ఫీచర్లు చూస్తే అవాక్కే.

Venkatrao Lella

Images: Pinterest

17 AUG 2026

దేశంలో కరెన్సీ నోట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న పేపర్ కరెన్సీ నోట్ల స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేసింది. 

ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుమతి మంజూరు చేసినట్లు కేంద్రం తెలిపింది. రూ.10, రూ.20 పాలిమర్ నోట్లను పైలట్ ప్రాజెక్ట్ కింద చలామణిలోకి తీసుకొచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్లమెంట్‌లో కేంద్ర ఆర్ధికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

ప్రయోగాత్మకంగా రూ.10, రూ.20 నోట్లను చెరో 100 కోట్ల నోట్ల చొప్పున తొలుత చలామణిలోకి తీసుకురానుంది. ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 25 కింద ఆర్‌బీఐ బోర్డు ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించగా ఆమోదం లభించింది.

నోట్లను చలామణిలోకి తీసుకొచ్చాక ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహిస్తారు. విజయవంతమైతే.. కాగితపు నోట్లతో పాటు వీటిని సైతం సాధారణ చలామణిలోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.

అయితే ప్లాస్టిక్ నోట్లు అందుబాటులోకి వచ్చినంత మాత్రాన  కరెన్సీ నోట్లను తొలగించమని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రెండు సమాంతరంగా చలామణిలో ఉంటాయని తెలిపింది. ఎప్పటిలాగే పేపర్ నోట్లను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది.

ప్లా్స్టిక్ నోట్ల తయారీ అనేది ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది. ఎంత ఖర్చు అవుతుందనేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమని కేంద్రం తెలిపింది. ఎప్పటినుంచి అందుబాటులోకి తీసుకొస్తామని ఇప్పుడే చెప్పలేమని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

అయితే 2027 ఆర్ధిక సంవత్సరం ప్రారంభం నుంచే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఈ నోట్లను సింథటిక్ ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారు చేస్తారు. నీటిలో తడిచినా లేదా మురికి పట్టినా ఇవి పాడవ్వవు.

ప్లాస్టిక్ నోట్లలో అనేక భద్రతా ఫీచర్లు, పారదర్శక విండోలు ఉంటాయి. దీంతో నకిలీ నోట్లను ప్రింట్ చేయడం కూడా చాలా కష్టం. దీని వల్ల నకిలీ నోట్ల బెడదకు చెక్ పడుతుంది

ప్రస్తుతం ఉన్న పేపర్ నోట్లు నీటిలో తడిచినా లేదా చెమట వల్ల నలిగిపోవడం, చినిగిపోవడం లాంటివి చోటుచేసుకుంటున్నాయి. కానీ పాలిమర్ నోట్లు 2.5 నుంచి 4 రెట్లు ఎక్కువ మన్నికను కలిగి ఉంటాయి. దీంతో చినిగిపోయే అవకాశం ఉండదు.