AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI Summit 2026: ప్రపంచ నేతలకు ప్రధాని మోదీ ‘AI’ విందు.. ఉత్తరాఖండ్ రాజ్‌మా, కశ్మీరీ గిర్దా!

ప్రస్తుతం దేశ రాజధాని న్యూ ఢిల్లీ అంతటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మంత్రంతో ప్రతిధ్వనిస్తోంది. భారత్ మండపంలో జరుగుతున్న 'ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026' కేవలం అల్గారిథమ్స్, కోడింగ్ గురించి మాత్రమే కాదు, భవిష్యత్తు సాంకేతికతపై సరికొత్త ఆశలను రేకెత్తిస్తోంది.

AI Summit 2026: ప్రపంచ నేతలకు ప్రధాని మోదీ ‘AI’ విందు.. ఉత్తరాఖండ్ రాజ్‌మా, కశ్మీరీ గిర్దా!
Ai Summit 2026 Dinner.jpg
Nikhil
|

Updated on: Feb 19, 2026 | 10:01 PM

Share

ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల ప్రతినిధులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ విందులో వడ్డించిన వంటకాలు భారతీయ సంస్కృతిని, భిన్నత్వాన్ని చాటిచెప్పాయి.

టెక్నాలజీ సదస్సు అంటే అంతా యంత్రాల గురించే అనుకుంటాం. కానీ ప్రధాని మోదీ మాత్రం ప్రపంచ నేతలకు భారతీయ ఆతిథ్యంతో పాటు మన దేశపు అసలైన రుచులను పరిచయం చేశారు. ‘శిశిర రుతువు’ థీమ్ తో రూపొందించిన ఈ విందు మెనూను ITC గ్రూప్ చెఫ్‌లు ప్రత్యేకంగా సిద్ధం చేశారు. కేవలం కడుపు నింపడమే కాకుండా, భారతీయ రైతుల కష్టాన్ని, మన నేల గొప్పతనాన్ని చాటిచెప్పేలా ప్రతి వంటకం ఉండటం విశేషం. ముఖ్యంగా భౌగోళిక గుర్తింపు (GI Tag) పొందిన పదార్ధాలకు ఈ విందులో పెద్దపీట వేశారు.

వార్ణిల – రంగుల ప్రారంభం..

విందు ప్రారంభంలో ‘వార్ణిల’ పేరుతో అద్భుతమైన స్టార్టర్ వడ్డించారు. పాత ఢిల్లీ రుచులను గుర్తు చేస్తూ.. కరకరలాడే బేబీ స్పినాచ్ (పాలకూర), పెరుగు స్పియర్స్, చింతపండు-ఖర్జూరం తీపి, జొన్నల క్రంచ్ తో దీనిని అద్భుతంగా రూపొందించారు. ఆధునికత, సంప్రదాయం కలిసిన ఈ వంటకం విదేశీ ప్రతినిధులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రధాన భోజనం ఉత్తరాఖండ్ ఘనమైన వంటకాలకు నివాళిగా నిలిచింది.

దీనికి ‘సస్య’ (పంట) అని పేరు పెట్టారు. ఉత్తరాఖండ్ లోని మున్సియారీ ప్రాంతానికి చెందిన GI ట్యాగ్ పొందిన రాజమాతో చేసిన ‘గిలావత్’ ఈ విందులో ప్రత్యేక ఆకర్షణ. దీంతో పాటు పహాడీ బియ్యం, జంగోరా పులావ్, ఆవ నూనె మరియు లోకల్ మసాలాలతో చేసిన కుమావోని ఆలూ సుబ్జ్ ను వడ్డించారు. మెనూలో ‘తఫ్తాన్’ అనే మెత్తని రొట్టెతో పాటు, కాశ్మీర్ లో ఎంతో ప్రసిద్ధి చెందిన ‘గిర్దా’ రొట్టెలను కూడా చేర్చారు.

నిసర్గ – తీపి ముగింపు..

భోజనం ముగింపులో ‘నిసర్గ’ పేరుతో వడ్డించిన డెజర్ట్ అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ‘రస్మలై త్రెస్‌ లెచెస్’ అనే ఈ వంటకంలో పాలతో తడిపిన చెన్నా స్పాంజ్, వింటర్ బెర్రీ కాంపొట్ మరియు గంటె జొన్నల స్ట్రూసెల్ తో చేసిన ఫ్యూజన్ స్వీట్ ఇది. ఇక విందు ముగిశాక సాంప్రదాయ కాశ్మీరీ క్వా, ఫిల్టర్ కాఫీ, డార్జిలింగ్ టీలతో పాటు ‘మిశ్రీ గుల్కండ్ చాక్లెట్ లీఫ్’ ను అతిథులకు అందించారు.

కేవలం ఆహారం మాత్రమే కాదు, విందు జరుగుతున్నంత సేపు భారతీయ శాస్త్రీయ సంగీతం, వివిధ రాష్ట్రాల జానపద నృత్యాలతో భారత్ మండపం కళకళలాడింది. టెక్నాలజీ సదస్సును ఒక సాంస్కృతిక పండుగలా మార్చడంలో భారత ప్రభుత్వం విజయం సాధించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ ప్రపంచ నాయకత్వం వహించాలని ఆశిస్తున్న తరుణంలో, ఇలాంటి విందులు మన దేశపు ‘సాఫ్ట్ పవర్’ ను ప్రపంచానికి చాటిచెబుతాయి. ఆధునిక సాంకేతికత, ప్రాచీన రుచుల సమ్మేళనంగా సాగిన ఈ విందు ప్రతినిధుల మనసు గెలుచుకుంది.

Follow Us