Mutton Curry: పంజాబీ మటన్ కర్రీ.. ఘాటైన రుచితో ఇలా చేస్తే నాన్వెజ్ ప్రియులకు పండగే..
పంజాబీ వంటకాలు తమదైన ప్రత్యేకతతో, ఘాటైన రుచులతో ఆహార ప్రియులను ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పంజాబీ మటన్ కర్రీ.. దాని కమ్మటి వాసన, కారంగా ఉండే రుచితో ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. ఎవ్వరైనా ఈజీగా చేసేయొచ్చు. మరి నోరూరించే ఈ మటన్ కర్రీని మీ ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా?

పంజాబీ వంటకాలు అంటేనే ఘాటైన రుచులకు, కమ్మటి సుగంధాలకు పెట్టింది పేరు. ఆ కోవలోనే మనకు పంజాబీ మటన్ కర్రీ వస్తుంది. ఇది అన్నం, రోటీ, నాన్.. దేనితో తిన్నా దాని రుచే వేరు. మరి అలాంటి రుచికరమైన, ఘాటైన పంజాబీ మటన్ కర్రీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
తయారీకి కావాల్సిన పదార్థాలు:
మటన్: 500 గ్రాములు
ఉప్పు: 1 టీస్పూన్ (రుచికి సరిపడా)
పసుపు పొడి: 1/4 టీస్పూన్
కారం పొడి: 2 టీస్పూన్లు (మీ కారానికి తగ్గట్టు సర్దుబాటు చేసుకోండి)
పెరుగు: 100 గ్రాములు (చిలికినది)
నూనె: 6 టేబుల్ స్పూన్లు (వేయించడానికి)
యాలకులు: 2-4
లవంగాలు: 5
దాల్చిన చెక్క: 2 చిన్న ముక్కలు
నల్ల యాలకులు: 2
మిరియాలు: 4-5
ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగినవి)
టొమాటోలు: 2 (తరిగినవి)
నెయ్యి: 4 టేబుల్ స్పూన్లు (లేదా నూనె)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టీస్పూన్లు
ధనియాల పొడి: 2 టీస్పూన్లు
గరం మసాలా పొడి: 1/4 టీస్పూన్
కసూరి మేథి: 3/4 టీస్పూన్
నీళ్లు: పావు లీటరు (250 మి.లీ)
కొత్తిమీర: తగినంత (తరుగు)
తయారీ విధానం: మటన్ మ్యారినేషన్:
ముందుగా మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
ఒక గిన్నెలో ఈ మటన్ ముక్కలకు ఉప్పు, పసుపు పొడి, కారం పొడి, చిలికిన పెరుగు వేసి బాగా కలపాలి.
దీన్ని ఒక గంట పాటు పక్కన పెడితే ముక్కలకు మసాలాలు బాగా పడతాయి.
మసాలా పేస్ట్ తయారీ:
ఒక పాన్ లో 1.5 టేబుల్ స్పూన్ నూనె వేడి చేయాలి.
దీనిలో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల యాలకులు, మిరియాలు వేసి సువాసన వచ్చేవరకు వేయించాలి.
తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి, అవి లేత గోధుమ రంగు వచ్చేవరకు బాగా వేయించుకోవాలి.
ఇప్పుడు తరిగిన టొమాటో ముక్కలను వేసి, కొద్దిగా మెత్తబడే వరకు 2 నిమిషాలు వేయించాలి.
ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి, మిక్సీలో మెత్తని పేస్ట్ గా రుబ్బుకోవాలి.
కూర వండటం:
ఒక ప్రెషర్ కుక్కర్లో 5 టేబుల్ స్పూన్ల నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయాలి.
దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయే వరకు తక్కువ మంటపై వేయించాలి.
ఇప్పుడు రుబ్బుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా కలిపి, తక్కువ మంటపై ఉంచి రంగు మారకుండా చూసుకోవాలి.
మారినేట్ చేసిన మటన్ వేసి, బాగా కలిపి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉంచాలి.
తర్వాత మంటను తగ్గించి ధనియాల పొడి, కారం పొడి (అవసరమైతే కొద్దిగా వేసుకోవచ్చు) వేసి బాగా కలపాలి.
మధ్యస్థ మంటపై 5 నిమిషాలు మటన్ను మసాలాతో కలిపి వేయించాలి. మసాలా, మటన్ బాగా వేగి నూనె పైకి తేలుతుంది.
ఇప్పుడు గరం మసాలా పొడి, ఉప్పు వేసి ఒక నిమిషం పాటు సిమ్మర్ లో ఉంచాలి.
తర్వాత నీళ్లు పోసి, బాగా కలిపి, కుక్కర్ మూత పెట్టాలి.
సమారుగా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆ తర్వాత మంట ఆపి ప్రెషర్ పోయే వరకు ఉంచాలి.
ప్రెషర్ కుక్కర్లో వండటం వలన త్వరగా అవుతుంది. ఇలా కాకుండా మందపాటి గిన్నెలో కూడా వండుకోవచ్చు, అప్పుడు మటన్ మెత్తబడే వరకు ఎక్కువ సమయం పడుతుంది.
ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి, మెత్తగా ఉడికిన తర్వాత కసూరి మేథి, కొత్తిమీర వేసి, ఒక్క నిమిషం ఉంచాలి.
