చైనాలోని సీ ఫుడ్ మార్కెట్ ని విజిట్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం, అంతా గప్ చుప్
కరోనా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా చేరిన ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల బృందం ఇన్నాళ్లకు వూహాన్ లో గల హ్యూనాన్ సీ ఫుడ్ మార్కెట్..

కరోనా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా చేరిన ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల బృందం ఇన్నాళ్లకు వూహాన్ లో గల హ్యూనాన్ సీ ఫుడ్ మార్కెట్ ని సందర్శించింది. ఆదివారం సుమారు 13 మంది నిపుణులు ఈ మార్కెట్ లో అడుగు పెట్టారు. అయితే గత ఏడాది జనవరిలో వూహన్ సిటీలో మొదటి కరోనా వైరస్ కేసు బయటపడడం, ఆ తరువాత ఇది కోవిడ్ 19 గా రూపాంతరం చెంది ప్రపంచ వ్యాప్త మహమ్మారిగా మారడంతో ఇక్కడి సీ ఫుడ్ మార్కెట్ ని మూసి వేశారు. అప్పటి నుంచి గేట్లన్నీ మూసిఉన్నాయి. కాగా ఈ వైరస్ సోర్స్ ని కనుగొనడానికి చైనా ను విజిట్ చేయాలనీ, అక్కడి పరిశోధకులతో చర్చించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థపై ఒత్తిడి పెరగడంతో సుమారు నెల క్రితం కొంతమంది నిపుణులు ఇక్కడికి చేరుకున్నారు. వీరంతా ఈ దేశ కరోనా వైరస్ ప్రొటొకాల్స్ ప్రకారం సుమారు 28 రోజులు క్వారంటైన్ లో ఉన్నారు. ఇన్ని రోజులూ కచ్చితంగా తమ కోవిడ్ సెంటర్ల నుంచి బయటకి రాలేదు.
ఇక తమ రీసెర్చ్ లో భాగంగా ఎట్టకేలకు ఆదివారం హ్యూనాన్ సీ మార్కెట్ ను వీరు సందర్శించారు. అయితే వీరిని తప్ప మరెవరినీ చైనీస్ అధికారులు లోపలికి అనుమతించలేదు. వీరు లోపలికి వెళ్ళగానే మళ్ళీ గేట్లను మూసివేశారు. ఒక నిపుణుడిని వివరాలు కనుగొనేందుకు మీడియా జర్నలిస్ట్ ఒకరు ప్రయత్నించగా ఆయన వెంటనే తన కారు డోర్ మూసేశారు. మిమ్మల్ని ఈ మార్కెట్ లోపలికి అనుమతించినందుకు తృప్తిగా ఉన్నారా అన్న ప్రశ్నకు మరొకరు థంబ్స్ అప్ గుర్తుగా తన బొటనవేలిని చూపారు. నిజానికి ఈ వైరస్ మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పెద్దగా దృష్టి సారించలేదు. అలాగే చైనాలోని అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ కూడా ఈ విషయానికి ప్రాధాన్యం ఇవ్వకుండా కప్పదాటు వేసింది.. అయితే దీని పుట్టుకకు చైనాయే కారణమంటూ ప్రపంచ దేశాలన్నీ గగ్గోలు పెట్టడంతో అయిష్టంగానే ముందుకు కదలక తప్పలేదు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు ఇక్కడి మరో హోల్ సేల్ మార్కెట్ ని కూడా సందర్శించినప్పటికీ అక్కడి నిర్వాహకులు స్టోరేజీలో ఉంచిన జంతు అవశేషాలను చూపేందుకు నిరాకరించారు. కేవలం తూతూ మంత్రంగా ఇక్కడి పరిస్థితులను చూసి వెళ్లాలని వారిని కోరారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ బృందం మీద చైనా అధికారులు ప్రతి క్షణం నిఘా నపెట్టారు. దాదాపు వారిని కట్టడి చేశారు.