UPSC Rank 301 Row: వీడిన మిస్టరీ.. యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో 301 ర్యాంకు లొల్లిపై కమిషన్ క్లారిటీ!
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 పరీక్ష తుది ఫలితాలు గత శుక్రవారం (మార్చి 6) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో ఒకే పేరుతో ఇద్దరు అభ్యర్థులు 301వ ర్యాంక్ను సాధించినట్లు సోషల్ మీడియాలో వారి అడ్మిట్ కార్డులు, ర్యాంకుల వివరాలు కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నియామకాల్లో ఇలా కూడా జరుగుతుందా? అనే సందేహం ప్రతి ఒక్కరిలో కలిగింది. ఈ నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వివరణ ఇస్తూ ప్రకటన జారీ చేసింది . అసలేం జరిగిందంటే..

న్యూఢిల్లీ, మార్చి 10: యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష తుది ఫలితాలు మార్చి 6, 2026న విడుదలయ్యాయి. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఆకాంక్ష సింగ్ అనే పేరు కలిగిన ఇద్దరు అభ్యర్థులు 301వ ర్యాంక్ సాధించినట్లు సోషల్ మీడియాలో ప్రకటించుకున్నారు. ఈ పరిణామం అభ్యర్థులలో, సోషల్ మీడియాలో గందరగోళాన్ని సృష్టించింది. ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న వివరాల ప్రకారం బీహార్కు చెందిన ఆకాంక్ష సింగ్ రోల్ నంబర్ 0856794 చూపించే అడ్మిట్ కార్డును షేర్ చేసింది. అయితే ఈ అడ్మిట్ కార్డులోని బార్కోడ్లో వేరే నంబర్ 0856569 అనే నంబర్ వేరుగా ఉండటంతో సందేహాలు తలెత్తాయి. మరోవైపు వారణాసి (యూపీ) నుంచి మరొక యువతి కూడా తన ర్యాంకు 301గా ప్రకటిస్తూ అడ్మిట్ కార్డు, ఇంటర్వ్యూ కాల్ లెటర్ వివరాలు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో రంగంలోకి దిగిన యూపీఎస్సీ బీహార్లోని అరా నుంచి ఆకాంక్ష సింగ్ చేసిన వాదన అబద్ధమని గుర్తించింది.
UPSC అభ్యర్థులు ఇద్దరూ ఇంతకుముందు 301వ ర్యాంక్కు ఒకే రోల్ నంబర్ను చూపించే పత్రాలను సమర్పించారు. అయితే బీహార్ అభ్యర్థి నుంచి వచ్చిన పత్రాలు చట్టవిరుద్ధమైనవిగా దర్యాప్తులో తేలింది. బీహార్ అభ్యర్థి మాజీ రణవీర్ సేన చీఫ్ మనవరాలు ఆకాంక్ష సింగ్ అసలు యూసీఎస్సీ సీఎస్ఈ పరీక్షకు హాజరు కాలేదని కమిషన్ స్పష్టం చేసింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (మెయిన్స్) 2025లో ఒకే ఒక్క అభ్యర్థి 301వ ర్యాంక్ సాధించారని యూపీఎస్సీ తెలిపింది. యూపీకి చెందిన అభ్యర్ధి ఆకాంక్ష సింగ్ 301 ర్యాంక్ హోల్డర్గా కమిషన్ నిర్ధారించింది. ఈ మేరకు యూపీఎస్సీ రికార్డులు చూపిస్తున్నట్లు వెల్లడించింది. ఆమె రోల్ నంబర్ 0856794, అభ్యర్థి తండ్రి పేరు రంజిత్ సింగ్, ఆమె తల్లి పేరు నీలం సింగ్ అని కమిషన్ పేర్కొంది. ఆమె ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ జిల్లాలోని అభాయ్పూర్ గ్రామానికి చెందిన అభ్యర్ధిగా కమిషన్ స్పష్టం చేసింది. ఈ వివరాలు కమిషన్ నిర్వహించే అధికారిక రికార్డులతో సరిపోలుతున్నాయని, పరీక్షలో 301 ర్యాంక్ సాధించిన అభ్యర్థి గుర్తింపును నిర్ధారిస్తాయని UPSC స్పష్టం చేసింది.

కాగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలు దేశంలో అత్యంత పోటీతత్వం కలిగిన నియామక పరీక్షలలో ఒకటి. ఎంతో కఠినమైన మూడు దశల ఒడపోత తర్వాత ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్ వంటి సర్వీసులకు యూపీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




