Lakhimpur Kheri: కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్ర అరెస్ట్..
Lakhimpur Kheri: ఈ నెల3న ఉత్తరప్రదేశ్లోని లఖింపుర్ ఖేరిలో హింసాత్మక ఘటన జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ ఘటనపై
Lakhimpur Kheri: ఈ నెల3న ఉత్తరప్రదేశ్లోని లఖింపుర్ ఖేరిలో హింసాత్మక ఘటన జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్రని అరెస్ట్ చేశారు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి ఆశిష్ మిశ్ర కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మృతిచెందగా అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు మృతిచెందారు. మొత్తం 8 మంది మృతి చెందారు. దీనిపై విచారణ చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్లో ఆశిష్ మిశ్ర పేరును చేర్చారు.
శుక్రవారమే అతడు పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది కానీ అనారోగ్యం కారణంగా హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో శనివారం క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట ఆశిష్ హాజరయ్యారు. 11 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేశారు. అయితే విచారణలో ఆశిష్ పోలీసులకు సహకరించలేదని తెలిసింది. దీంతో పోలీసులు ఆశిష్ మిశ్రను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. కాగా ఈ ఘటనపై దేశవ్యాప్తంగా రైతులు మండిపడుతున్నారు. ఉత్తరప్రదేశ్ మొత్తం అట్టుడికిపోతోంది.
అయితే ఈ ఘటనపై మంత్రి అజయ్ మిశ్రా మాత్రం మరోలా చెబుతున్నారు. తన కుమారుడు సంఘటన స్థలంలో లేడని అంటున్నారు. అంతేకాదు నిరూపించడానికి తన వద్ద ఫోటో, వీడియో ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ ఘటన జరిగే సమయంలో తన కుమారుడు ఉప ముఖ్యమంత్రి వేదిక వద్ద ఉన్నారని, వేలాది మంది ప్రజలు, పోలీసు అధికారులు కూడా అక్కడే ఉన్నారని పేర్కొన్నారు. మరోవైపు లఖింపూర్ ఖేరీ ఘటనపై ప్రతి పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి కొడుకు కారెక్కించడం దారుణమంటున్నారు. కాంగ్రెస్, బిఎస్పి, ఎస్పి సహా అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ తీరును ఎండగడుతున్నాయి.