ఢిల్లీలో కలకలం..డ్రైనేజీలో మరో రెండు మృతదేహాలు..
గోకల్పురిలోని తూర్పు యమునా కాలువ నుంచి గుర్తు తెలియని రెండు మృతదేహాలను ఢిల్లీ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. అల్లరి బాధిత ప్రాంతాలైన జాఫ్రాబాద్, యమునా విహార్, చంద్ బాగ్ గుండా యమునా డ్రైనేజ్ కాలువ ప్రవహిస్తోంది.
గోకల్పురిలోని తూర్పు యమునా కాలువ నుంచి గుర్తు తెలియని రెండు మృతదేహాలను ఢిల్లీ పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. అల్లరి బాధిత ప్రాంతాలైన జాఫ్రాబాద్, యమునా విహార్, చంద్ బాగ్ గుండా యమునా డ్రైనేజ్ కాలువ ప్రవహిస్తోంది. ఈ మరణాలు ఇటీవలి హింసకు సంబంధించినవా?..లేదా ఆత్మహత్య, ఇతరత్రా కారణాలకు చెందినవా అనేది నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పోస్ట్మార్టం నిమిత్తం డెడ్బాడీలను జీటీబీ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం లభ్యమైన రెండు మృతదేహాలతో కలుపుకోని… యమునా కాలువ నుండి ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న డెడ్బాడీల సంఖ్య ఐదుకి చేరింది.
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఈశాన్య ఢిల్లీ అట్టుడికిపోయింది. ఈ వయోలెన్స్లో ఇంటలిజెన్స్ బ్యూరో కానిస్టేబుల్ అంకిత్ శర్మ దారుణ హత్యకు గురయ్యారు. ఆయన మృతదేహాన్ని యమునా డ్రైనేజీ కాలవలో పడేసిన ఘటన దేశమంతటిని ఒక కుదుపు కుదిపేసింది. అతని పోస్ట్మార్టమ్ రిపోర్ట్లో సంచలన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అతని శరీరంలోని ప్రతి భాగాన్ని చిధ్రం చేసినట్టు తేలింది. కాగా డ్రైనేజీలో మరో రెండు మృతదేహాలు లభ్యం కావడం ఇప్పడు కొత్త అనుమానాలకు తావిస్తోంది. దీనిపై పోలీసులు నుంచి ఎటువంటి నివేదిక వస్తుందనే అంశంపై చర్చ జరుగుతోంది. అల్లర్లకు సంబంధించి శనివారం వరకు ఢిల్లీ పోలీసులు 167 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. నార్త్ ఈస్ట్ జిల్లా హింసకు సంబంధించి మొత్తం 885 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ హింసలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 200 మందికి పైగా గాయపడ్డారు.