AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయోధ్య కేసు : అక్టోబర్‌ 18లోగా వాదనలు… నవంబర్ 17లోగా తుది తీర్పు?

అయోధ్య వివాదంపై అక్టోబర్‌ 18 నాటికి అన్ని పార్టీలు తమ వాదనలను ముగించాలని, అవసరమైతే ఆదివారాలతో పాటు ప్రతి రోజు ఒక గంట అదనంగా విచారణ చేపడతామని సుప్రీం కోర్టు బుధవారం స్పష్టం చేసింది. అయోధ్య భూ వివాదం కేసులో ఆగస్టు 6 నుంచి సర్వోన్నత న్యాయస్థానం రోజువారీ విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం నాటి విచారణలో భాగంగా అక్టోబరు 18తో వాదనలు ముగియనున్నట్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. అదే రోజున విచారణ […]

అయోధ్య కేసు : అక్టోబర్‌ 18లోగా వాదనలు... నవంబర్ 17లోగా తుది తీర్పు?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 18, 2019 | 4:06 PM

Share

అయోధ్య వివాదంపై అక్టోబర్‌ 18 నాటికి అన్ని పార్టీలు తమ వాదనలను ముగించాలని, అవసరమైతే ఆదివారాలతో పాటు ప్రతి రోజు ఒక గంట అదనంగా విచారణ చేపడతామని సుప్రీం కోర్టు బుధవారం స్పష్టం చేసింది. అయోధ్య భూ వివాదం కేసులో ఆగస్టు 6 నుంచి సర్వోన్నత న్యాయస్థానం రోజువారీ విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం నాటి విచారణలో భాగంగా అక్టోబరు 18తో వాదనలు ముగియనున్నట్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. అదే రోజున విచారణ కూడా పూర్తి చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. అక్టోబరు 18 నాటికి ఈ కేసు విచారణ పూర్తిచేయాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్‌ కోరారు. అదే రోజున తీర్పును రిజర్వ్‌ చేసే అవకాశం ఉంది. నవంబర్ 17న జస్టిస్ గొగొయ్‌ పదవీకాలం ముగియనుండగా, ఈ లోపు అయోధ్య వివాదంపై తీర్పు వెలువడే సూచనలు ఉన్నాయి.

అయోధ్య రామ జన్మ భూమి వివాదంపై గతంలో సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తిత్వ కమిటీకి నేతృత్వం వహించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్ఎంఐ కలీఫుల్లా రాసిన లేఖపై ధర్మాసనం స్పందించింది. ఈ కేసులోని పార్టీలు మధ్యవర్తిత్వాన్ని కొనసాగించాలని కోరుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది. మందిర వివాదంపై మధ్యవర్తిత్వానికి సంబంధించి కోర్టుకు ప్రతిపాదన లేఖ వచ్చిందని, పరస్పరం చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి ఆయా పార్టీలు ముందుకువస్తే తమకు తెలియచేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ నేతృత్వంలోని సుప్రీం బెంచ్‌ పేర్కొంది. ఆయా పార్టీలు అంగీకరిస్తే విచారణతో పాటు మధ్యవర్తిత్వ ప్రక్రియ కూడా సాగుతుందని వెల్లడించింది.

ఎప్పటిలాగే మధ్యవర్తిత్వ కమిటీ సంప్రదింపులను గోప్యంగా కొనసాగించాలని సూచించింది. ఈ కమిటీతో పాటు కోర్టులో విచారణ సాగుతుందని తెలిపింది. కొన్ని పార్టీలు మధ్యవర్తిత్వం కొనసాగించాలని తనకు లేఖ రాసినట్టు జస్టిస్ కలీఫుల్లా పేర్కొవడంతో సుప్రీం ఈ నిర్ణయం తీసుకుంది. అయోధ్య భూవివాదం కేసు కీలక దశకు చేరుకుందని, రోజువారీ విచారణ కొనసాగుతుందని ధర్మాసనం తెలిపింది. ఈ కేసు విచారణలో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల ధర్మాసనం ఇరువర్గాల వాదనను వింటోంది. సుప్రీం విచారణకు ముందు అలహాబాద్ హైకోర్టు.. 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు, నిర్మోహి అఖారా అండ్ రామ్ లాలాకు సమానంగా పంచాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ 14 పిటిషన్లు సుప్రీంలో దాఖలయ్యాయి.

అక్టోబరు 18 నాటికి హిందూ, ముస్లిం పార్టీలకు చెందిన లాయర్లు తమ వాదనలు పూర్తిచేయాలని జస్టిస్ ఎస్ఏ బాబ్డ్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్‌‌లు సూచించారు. అయోధ్య కేసులో సుప్రీం నియమించిన మధ్వవర్తిత్వ కమిటీ నాలుగు నెలలు పాటు వివిధ పార్టీలతో సంప్రదింపులు జరిపినా, ఎలాంటి పరిష్కారం చూపించలేకపోయింది. తొలుత ఈ కమిటీకి ఎనిమిది వారాల గడువు విధించిన సుప్రీం, తర్వాత ఆగస్టు 15 వరకు పొడిగించింది. కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించిన రాజ్యాంగ ధర్మాసనం.. కేసు విచారణను వేగవంతం చేసింది.