జైలు నుంచి బయట ప్రపంచంలోకి అడుగు పెట్టనున్న చిన్నమ్మ.. జనవరి 27న విడుదలకు లైన్ క్లియర్..!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ జైలు నుంచి విడులయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. చిన్నమ్మ జైలు జీవితం వీడి బయట ప్రపంచంలోకి అడుగు పెట్టేందుకు...
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ జైలు నుంచి విడులయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. చిన్నమ్మ జైలు జీవితం వీడి బయట ప్రపంచంలోకి అడుగు పెట్టేందుకు మార్గం క్లియర్ అయినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆమె వచ్చే ఏడాది జనవరి 27న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అయితే చిన్నమ్మ విడుదల సమయంలో చేపట్టాల్సిన బందోబస్తుపై కర్ణాటక సర్కార్ గురువారం ఉత్తర్వులు జారీ చేస్తూ శశికళ విడుదల విషయాన్ని అనధికారికంగా ధృవీకరించింది.ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఆమె వదిన ఇళవరసి, అక్క కుమారుడు సుధాకరన్ 2017 ఫిబ్రవరి 15 నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
అయితే వీరి శిక్షాకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో పూర్తి కానుంది. గతనెల 17న చిన్నమ్మ తన జరిమానాను న్యాయవాది ద్వారా బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో చెల్లించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇళవరసి కూడా జరిమానా చెల్లించగా, వీఎన్ సుధాకరన్ మాత్రం జరిమానా ఇంకా చెల్లించలేదు.సుధాకరన్ శిక్షకాలం కూడా త్వరలో ముగియనున్న నేపథ్యంలో జరిమానా చెల్లింపునకు అనుమతి, విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన న్యాయవాదులు సెప్టెంబర్ 8న అదే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసులో తుది తీర్పు వెలువడే నాటికి 122 రోజులు జైల్లో గడిపినందున నాలుగేళ్ల శిక్షకాలంలో వీటిని మినహాయించుకుని జైలు నుంచి విడుదల చేయాల్సిందిగా సుధాకరన్ న్యాయవాదులు కోర్టును కోరారు. విడుదల ఆదేశాలు రాగానే జరిమానా చెల్లిస్తామని కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు రాగా, జరిమానా చెల్లించగానే శిక్ష కాలం రోజులు కలుపుకొని సుధాకరన్ను వెంటనే విడుదల చేయాలని బెంగళూరు సివిల్ కోర్టు గురువారం తీర్పునిచ్చింది. అయితే జరిమానా మొత్తాన్ని చెల్లింపునకు న్యాయవాదులు సిద్ధంగా ఉండగా, రెండు, మూడు రోజుల్లో సుధాకరన్ విడుదల అయ్యే అవకాశాలున్నాయని న్యాయవాదులుఅంచనా వేస్తున్నారు.
వచ్చే ఏడాది శశికళ విడుదల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుధాకరన్ విడుదలపై కొంత స్పష్టత రావడంతో అదే కేసుకు చెందిన చిన్నమ్మ కూడా జైలు నుంచి విడుదలకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. అయితే విచారణ ఖైదీగా చిన్నమ్మ జైల్లో గడిపిన రోజులను పరిగణలోకి తీసుకుని 2021 జనవరి 27వ తేదీన రాత్రి 10 గంటలలోపు విడుదలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
భారీ బందోబస్తు వచ్యే ఏడాది జనవరిలో చిన్నమ్మ విడుదలయ్యే అవకాశాలుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతోంది. టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకు చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో జైలు వద్దకు చేరుకుని శశికళకు ఘన స్వాగతం పలికే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి తమిళనాడు సరిహద్దుకు చేరే వరకు శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖకు కర్ణాటక సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.