గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేడెక్కిన రాజకీయం.. బల్దియా పీఠమే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాల్లో పార్టీల నేతలు..
బల్దియాపై జెండా ఎగరేయాలనే సంకల్పంతో అధికార టీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందిస్తున్నాయి.

#GHMCElectionspoliticalparties: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. ఈసారి బల్దియాపై జెండా ఎగరేయాలనే సంకల్పంతో అధికార టీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందిస్తున్నాయి. ఇందులో భాగంగా డివిజన్ల వారీగా సమర్ధులైన అభ్యర్థుల ఎంపిక కోసం ఆయా పార్టీలు లోతుగా కసరత్తు చేస్తున్నాయి.
బస్తీమే సవాల్ కోసం టీఆర్ఎస్ ముందుగానే రెడీ అయింది. వెంటనే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను, షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ తీరుపైన కాంగ్రెస్, బీజేపీ గుస్సా అయ్యాయి. ప్రతిపక్షాలకు సమయం ఇవ్వకుండా ఎన్నికలు ప్రకటించారన్నది హస్తం పార్టీ తెలంగాణ నేత ఉత్తమ్ ఆరోపణ. ఎలా గెలుస్తారంటే తాము చేసిన పనులే అంటున్నారు. ఎన్ని సీట్లు వస్తాయంటే మేయర్ సీటు సాధించేంత అని చెబుతున్నారు.
ఇదే లైన్లో మాట్లాడారు బీజేపీ నేతలు కిషన్రెడ్డి, లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి. తమను నేరుగా ఎదుర్కోలేక- బూత్లను ఆక్రమించడానికే బ్యాలెట్ అంటున్నారు ఇంద్రసేనారెడ్డి. ఇక లక్ష్మణ్ మరో అడుగు ముందుకేసి LRS పోవాలటే గ్రేటర్లో టఆర్ఎస్ కి వీఆర్ఎస్ ఇవ్వాలంటూ పంచ్ డైలాగులు పేల్చుతున్నారు. హైదరాబాద్కు టీఆర్ఎస్ చేసిందేమీ లేదనీ, ఓట్ల కోసం ప్రభుత్వం తాయిలాలు ప్రకటిస్తోందని గ్రేటర్ ఎన్నికల కెప్టెన్ కిషన్రెడ్డి విమర్శించారు. ఇలా కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలు- ఈ ఎన్నికల్లో అజెండా సెట్ చేయబోతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ విమర్శలకు గులాబీ నేతలు కౌంటర్ ఇస్తారేమో.
ఓవైపు రిజర్వేషన్ల రచ్చ నడుస్తుంటే.. ఇంకోవైపు అధికార, విపక్షాల మధ్య డైలాగ్వార్ మామూలుగా లేదు. దుబ్బాక సీన్ తర్వాత ఊపు మీదున్న బీజేపీ గ్రేటర్లో పాగా వేయాలని చూస్తోంది. దానికి తగ్గట్టుగానే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తోంది. కానీ.. టీఆర్ఎస్ మాత్రం బీజేపీని లైట్ తీసుకుంటోంది. అసలు.. దుబ్బాకలో తాము ఓడిపోలేదన్నది గులాబీదళం వాదన. కారును పోలి ఉన్న గుర్తులపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దుబ్బాకలో రోటీ మేకర్ వల్లే ఓడిపోయామన్నది గులాబీ నేతల వెర్షన్. గతంలోనూ కారును పోలిన గుర్తులు ఓట్ల సంఖ్య తగ్గించాయని.. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పొరపాటు లేకుండా చూడాలని అంటోంది అధికార టీఆర్ఎస్. కొన్ని గుర్తులపై అభ్యంతరం చెబుతూ.. వాటన్నింటినీ తొలగించాలని చెబుతోంది. ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అధికారులను కలిసి నివేదించుకున్నారు.
