Andhra Pradesh: వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది ఆ పార్టీ నుంచే.. తారక్ ను మోసం చేశారు.. వల్లభనేని వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు..
విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానన్న ప్రచారంలో నిజం లేదని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. 2024 లో వైసీపీ నుంచి పోటీ చేస్తానని తెలిపారు. విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడాన్ని తాను వ్యతిరేకించలేదని, మరోసారి పేరు మార్పును..
కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వచ్చే ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీతో పాటు, జనసేనపై ఆయన విమర్శలు గుప్పించారు. తనపై వస్తున్నవని వదంతులేనని, వాటిలో వాస్తవం లేదన్నారు. తాను 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచే పోటీ చేస్తానని చెప్పిన వల్లభనేని వంశీ, తాను విజయవాడ ఎంపీగా పోటీచేస్తానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. దీంతో గన్నవరం ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి పోటీచేసేది తానేనని చెప్పకనే చెప్పారు. 2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి టీడీపీ తరపున వల్లభనేని వంశీ పోటీచేయగా, వైసీపీ నుంచి పోటీచేసిన యార్లగడ్డ వెంకట్రావు వంశీ చేతిలో 838 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికలు ముగిసి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొద్దిరోజుల తర్వాత వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీని విమర్శించడంతో పాటు, వైసీపీకి దగ్గరగా ఉంటూ వస్తున్నారు. దీంతో నియోజకవర్గంలోని స్థానిక వైసీపీ నాయకులు వల్లభనేని వంశీ తీరుపట్ల వ్యతిరేకతతో ఉన్నారు. కొన్ని సందర్భాల్లో బహిరంగంగానే వైసీపీ నాయకులు తమ అసంతృప్తిని తెలియజేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే గన్నవరంలో వైసీపీకి పాత నాయకులు ఉండటంతో వల్లభనేని వంశీని విజయవాడ ఎంపీ స్థానం నుంచి పోటీచేయించవచ్చనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం విజయవాడ ఎంపీగా టీడీపీ నుంచి కేశీనేని శ్రీనివాస్ (నాని) ఉన్నారు. 2019లో వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా వ్యాపారవేత్త పొట్టూరి వరప్రసాద్ (పీవీపీ) పోటీచేశారు. ఎన్నికల తర్వాత పీవీపీ వైసీపీలో పెద్దగా యాక్టివ్ గా లేరు. దీంతో వైసీపీ నుంచి వల్లభనేని వంశీ వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీచేయవచ్చనే ప్రచారం జరగుతోంది. ఈనేపథ్యంలో ఈ ప్రచారంపై వల్లభనేని వంశీ స్పందించారు.
విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానన్న ప్రచారంలో నిజం లేదని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. 2024 లో వైసీపీ నుంచి పోటీ చేస్తానని తెలిపారు. విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడాన్ని తాను వ్యతిరేకించలేదని, మరోసారి పేరు మార్పును పరిశీలించాలని కోరినట్లు చెప్పారు. ఎన్టీఆర్, వైఎస్సార్ చాలా పెద్ద నాయకులని పేరు మార్చినంత మాత్రన ఎన్టీఆర్ ను తక్కువ చేసినట్లు కాదన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకొని వదిలేసిందని వల్లభనేని వంశీ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తోక పట్టుకుని ఈదాలనుకుంటున్నారని విమర్శించారు.
పవన్ కళ్యాణ్ తన క్యాడర్ను అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మంత్రులపై దాడి చేయటం చాలా పొరపాటని వల్లభనేని వంశీ అన్నారు. 6 శాతం ఓట్ బ్యాంక్ ఉన్న జనసేన ఇలా దాడి చేస్తే 50 శాతం ఓట్ బ్యాంక్ ఉన్న వైసీపీ దాడి చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. గన్నవరం నుంచి తానే మళ్లీ పోటీచేస్తానని, ఎంపీ స్థానానికి పోటీ చేయబోనని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల సమయంలో ఎక్కడి నుంచి ఎవరు పోటీచేయాలనేదానిపై పార్టీలో చర్చించి వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి తుది నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటివరకు పార్టీ నుంచి గన్నవరం అభ్యర్థిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికి, గన్నవరం నుంచి తానే పోటీచేస్తానని, ఎంపీగా కాదని వంశీ చెప్పడంపై గన్నవరంలో మిగతా వైసీపీ క్యాడర్ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..