Corona Vaccine: కరోనా టీకా రెండు డోసులూ తీసుకోవాల్సిందేనా..రెండో డోసు ఎందుకు తీసుకోవాలి? నిపుణులు ఏమంటున్నారు?

కరోనా నుంచి మనల్ని రక్షించగలిగేవి రెండే రెండు. ఒకటి కరోనా టీకా.. రెండు జాగ్రత్తగా ఉండడం. ఇప్పుడు అందరికీ శ్రీరామరక్ష టీకా మాత్రమే అంటే అతిశయోక్తి కాదు.

Corona Vaccine: కరోనా టీకా రెండు డోసులూ తీసుకోవాల్సిందేనా..రెండో డోసు ఎందుకు తీసుకోవాలి? నిపుణులు ఏమంటున్నారు?
Vaccination
Follow us

|

Updated on: Apr 17, 2021 | 4:46 PM

Corona Vaccine: కరోనా నుంచి మనల్ని రక్షించగలిగేవి రెండే రెండు. ఒకటి కరోనా టీకా.. రెండు జాగ్రత్తగా ఉండడం. ఇప్పుడు అందరికీ శ్రీరామరక్ష టీకా మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. కరోనా కారుచీకట్లో ఉన్న ఏకైక చిరుదీపం వ్యాక్సిన్ మాత్రమె. కానీ, టీకా తీసుకున్నా జాగ్రత్తలు కూడా తప్పనిసరి. ఇక కరోనా టీకాను రెండు డోసులు తీసుకోవాలని మొదటి నుంచి వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా కట్టడి చేయాలంటే ఒక డోసు వ్యాక్సిన్ సరిపోదనీ, రెండో డోసు కూడా కావాలనీ చెబుతూ వస్తున్నారు వైద్యులు. అయితే, ఇలా ఎందుకు అనే అనుమానాలు చాలా మంది ప్రజల్లో ఉన్నాయి. వాటిని నివృత్తి చేసే ప్రయత్నం చేశారు ఎయిమ్స్ డాక్టర్ రణదీప్ గులేరియా. కోవిడ్ వ్యాక్సిన్ పై ఉన్న అనుమానాలకు ఆయన ఒక వీడియోలో సమాధానం ఇచ్చారు. ఈ వీడియోను కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

డాక్టర్ రణ్‌దీప్ గులేరియా కరోనా వ్యాక్సిన్ రెండుసార్లు ఎందుకు తీసుకోవాలనే విషయంపై స్పష్టతను ఇచ్చారు ఆ వీడియోలో ‘కరోనా మొదటి డోసును ప్రైమ్‌ డోసు అంటారు. ఇది ప్రతిరోధకాల కోసం రోగనిరోధక వ్యవస్థను సిద్ధం చేస్తుంది. మొదటి దశలో ప్రతిరోధకాలు విడుదలైనా.. అవి ఎక్కువ కాలం ఉండవు. కాలంతో పాటు క్షీణిస్తాయి. బూస్టర్‌ డోసుగా చెప్పే రెండో డోసుతో భారీగా ప్రతిరోధకాలు ఉత్పత్తి అవుతాయి. దాంతో కరోనా వైరస్‌ను కట్టడి చేసే బలమైన రక్షణ లభిస్తుంది. అలాగే మెమొరీ కణాలు కూడా రెండో డోసుతో ప్రేరేపితమవుతాయి. దాంతో వైరస్‌ను శరీరం దీర్ఘకాలం గుర్తుంచుకునే వీలుంటుంది. భవిష్యత్తులో మరోసారి వైరస్‌ బారిన పడినా.. త్వరిత గతిన ప్రతిరోధకాలు విడుదలవుతాయి’ అని గులేరియా వివరించారు.

కాగా, కరోనా టీకాను కచ్చితంగా 28 రోజుల వ్యవధిలో రెండు దోషులుగా తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు చెబుతున్నాయి. రెండో డోసు తీసుకున్న రెండు వారాల తరువాత కరోనా నుంచి రక్షణకు అవసరమైన ప్రతిరోధకాలు విడుదల అవుతాయని నిపుణులు అంటున్నారు. అదేవిధంగా సెంటర్స్‌ ఫర్ డిసీజ్‌ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) మార్గదర్శకాలు కూడా నిర్ణీత వ్యవధిలో రెండో డోసు తీసుకోవాలని చెబుతున్నాయి. ఒకవేళ ఆ సమయానికి వీలు పడకపోతే మొదటి డోసు తీసుకున్న ఆరువారాల్లో రెండో డోసు కచ్చితంగా తీసుకోవాలి. అయితే, ఇంకా ఆలస్యం అయితే రోగ నిరోదికత ఎలా ఉంటుంది అంటే దానిపై స్పష్టత లేదు.

డాక్టర్ రణ్‌దీప్ గులేరియా చెప్పిన కరోనా వ్యాక్సిన్ విశేషాలు ఈ వీడియోలో మీరూ చూడండి..

ఇదిలా ఉంటె, ప్రస్తుతం భారత్ లో కేసుల సంఖ్య రోజురోజుకు ప్రమాదకరంగా పెరుగుతోంది. మరణాలు కూడా కలవరపెడుతున్నాయి. కొత్తగా దేశంలో 2,34,692 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఏప్రిల్ 17 నాటికి మొత్తం కేసుల సంఖ్య 1,45,26,609కు చేరింది. తాజాగా 1,341 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు.