Black Box Recorders : బ్లాక్బాక్సుల జాడ లభ్యం.. ఇండోనేసియా విమాన ప్రమాదంపై అధికారుల ఫోకస్..
ఇండోనేసియా విమాన ప్రమాదంలో కీలక ఆదారం లభ్యమైంది. శనివారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైన విమానానికి చెందిన రెండు బ్లాక్ బాక్సుల ఆచూకీ దొరికింది. సిగ్నల్స్ను బట్టి వాటిని త్వరలోనే..
Black Box Recorders : ఇండోనేసియా విమాన ప్రమాదంలో కీలక ఆదారం లభ్యమైంది. శనివారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైన విమానానికి చెందిన రెండు బ్లాక్ బాక్సుల ఆచూకీ దొరికింది. సిగ్నల్స్ను బట్టి వాటిని త్వరలోనే వెలికితీస్తామని అక్కడి అధికారులు ప్రకటించారు. జకార్తాలో బయల్దేరిన సదకె ఎస్జే 182 విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఆచూకీ కోల్పోయింది. అనంతరం శనివారం సాయంత్రం లాంకాంగ్, లకీ ద్వీపాల మధ్య ఈ శ్రీవిజయ విమాన శకలాలు, మనుషుల శరీర భాగాలు, దుస్తులు తదితర వస్తులు లభించాయి. దీనితో ఆ విమానం కూలిపోయి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు.
శ్రీవిజయ ఎయిర్కు చెందిన ఈ జెట్ విమానంలో ఏడుగురు చిన్నారులు, ముగ్గురు శిశువులు, సిబ్బందితో సహా మొత్తం 62 మంది ప్రయాణికులు ఉన్నారు. శనివారం మధ్యాహ్నం 2:36 నిమిషాలకు టేకాఫ్ అయిన ఈ విమానం.. నాలుగు నిమిషాల్లో 10వేల 900 అడుగుల ఎత్తుకు చేరుకుంది. అనంతరం ఉన్నట్టుండి కిందకు పడిపోవటం మొదలై.. 21 సెకన్ల తర్వాత గ్రౌండ్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి.
ఆ తర్వాత ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే పనిలో ఎయిర్ పోర్ట్ అధికారలు ఫోకస్ పెట్టారు. సదరు విమానాన్ని నడుపుతున్న పైలట్లు 10ఏళ్లకు పైగా అనుభవమున్నవారని అధికారులు వెల్లడించారు. బ్లాక్బాక్సులను వెలికితీసి, పరిశీలన చేపట్టిన అనంతరం మరిన్ని వివరాలు లభ్యమవుతాయని సైన్యాధ్యక్షుడు హదీ జజాంటో ప్రకటించారు.
కాగా, ఇతర దేశాల కంటే ఇండోనేసియాలో విమాన ప్రమాదాలు అధికమేనని ఏవియేషన్ సేఫ్టీ నెట్వర్క్ లెక్కలు చెబుతున్నాయి. వరుస ప్రమాదాలు చోటుచేసుకున్న కారణంగా.. ఈ దేశానికి చెందిన అన్ని విమానాలపై యూరోపియన్ యూనియన్ 2007లో నిషేధం విధించింది. ఈ ఆంక్షలు 2018 వరకు అమలులో ఉన్నాయి. అయితే కొన్ని దేశా ఈ మధ్యే ఆ ఆంక్షలను ఎత్తివేశాయి. అంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.