AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: చేతబడి అనుమానం.. రెండేళ్ల కక్ష.. అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ ఏజెంట్ దారుణ హత్య!

హైదరాబాద్: పాతబస్తీలో చేతబడి అనుమానం ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీసిన ఘటన కలకలం రేపుతోంది. రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి మరణానికి చేతబడి కారణమంటూ కుటుంబ సభ్యులు అనుమానించడంతో మొదలైన వివాదం.. చివరకు రియల్ ఎస్టేట్ ఏజెంట్ మెహబూబ్ అలీ హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

Hyderabad: చేతబడి అనుమానం.. రెండేళ్ల కక్ష.. అర్ధరాత్రి రియల్ ఎస్టేట్ ఏజెంట్ దారుణ హత్య!
Hyderabad Crime
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Sep 01, 2026 | 10:15 AM

Share

హైదరాబాద్: పాతబస్తీలో చేతబడి అనుమానం ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీసిన ఘటన కలకలం రేపుతోంది. రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి మరణానికి చేతబడి కారణమంటూ కుటుంబ సభ్యులు అనుమానించడంతో మొదలైన వివాదం.. చివరకు రియల్ ఎస్టేట్ ఏజెంట్ మెహబూబ్ అలీ హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెహబూబ్ అలీ బావ ఖలీల్ రెండేళ్ల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. కొంతకాలం చికిత్స పొందిన అనంతరం మృతి చెందాడు. అయితే ఖలీల్ కుటుంబ సభ్యులకు ఆయన మృతిపై అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరో చేతబడి చేయడం వల్లే ఖలీల్ అనారోగ్యానికి గురై మృతి చెందాడని వారు అనుమానించారు. ఈ క్రమంలో మెహబూబ్ అలీపై కూడా అనుమానం వ్యక్తం చేశారు.

ఈ పాత అనుమానమే రెండేళ్ల తర్వాత మరోసారి వివాదానికి కారణమైంది. ఖలీల్ సోదరి తహిరా బీ రాత్రి సమయంలో మెహబూబ్ అలీ ఇంటికి వెళ్లి అతడితో గొడవకు దిగినట్లు పోలీసులు చెబుతున్నారు. తన అన్న ఖలీల్ మృతికి మెహబూబ్ అలీ కారణమంటూ ఆమె ఆరోపించింది. మాటామాటా పెరగడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకుంది.

ఈ ఘటన అనంతరం మెహబూబ్ అలీపై కొందరు కక్ష పెంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో రోడ్డుపై వెళ్తున్న మెహబూబ్ అలీని మోసిన్‌తో పాటు మరికొందరు అడ్డగించారు. అనంతరం అతడిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన మెహబూబ్ అలీ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

అయితే ఖలీల్ మరణానికి నిజంగా చేతబడి కారణమా? మెహబూబ్ అలీపై కుటుంబ సభ్యులకు ఎందుకు అనుమానం వచ్చింది? తహిరా బీ, మెహబూబ్ అలీ మధ్య జరిగిన అసలు వివాదం ఏమిటి? మోసిన్‌ గ్యాంగ్ ముందస్తు ప్రణాళికతోనే హత్యకు పాల్పడిందా? అనే కోణాల్లో ఫలక్‌నుమా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చేతబడి అనుమానాలు, పాత కక్షలు చివరకు హత్యకు దారితీయడంతో పాతబస్తీలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us