జీహెచ్ఎంసీ ఎన్నికలకు కరోనా కష్టాలు.. ఓటర్లను కలవకుండానే ప్రచారాలు.. సోషల్ మీడియాతో నేతల సందడి..
ఒకప్పుడు ఎన్నికలంటే ప్రచార అర్భాటాలు.. ఫ్లెక్లీలు, డోర టూ డోర్ క్యాంపెయినింగ్, వాల్ రైటింగ్.. ఇలా ఒకటేమిటి.. వందలాది మందితో ర్యాలీ ప్రదర్శనలు.. కానీ ఇప్పడిదంతా కనిపించడంలేదు.
ఒకప్పుడు ఎన్నికలంటే ప్రచార అర్భాటాలు.. ఫ్లెక్లీలు, డోర టూ డోర్ క్యాంపెయినింగ్, వాల్ రైటింగ్.. ఇలా ఒకటేమిటి.. వందలాది మందితో ర్యాలీ ప్రదర్శనలు.. కానీ ఇప్పడిదంతా కనిపించడంలేదు. కరోనా పుణ్యామాని ఇంట్లో కూర్చోని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇందుకోసం అందివచ్చిన సాంకేతికతను ఉపయోగించుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు అభ్యర్థులు.
సాధారణంగా ఎన్నికలంటే అభ్యర్థులు టిక్కెట్ దక్కించుకోవడం నుంచి గెలిచే వరకు తీవ్రంగా శ్రమిస్తారు. ఇంటింటికి తిరిగి తనకే ఓటు వేయాలని కోరుతుంటారు. కార్యకర్తలు, అభిమానులను వెంట తీసుకెళ్లి ప్రచారం చేస్తుంటారు. ఎంతో మందికి ఉపాధి కూడా లభిస్తుంది. ముఖ్యంగా అడ్డాకూలీలకు ఎక్కువ డిమాండ్ ఉండేది. హైదరాబాద్ మహానగరం పరిధిలో కొవిడ్ కేసులు సంఖ్య అత్యధికంగా నమోదవుతుండటంతో అభ్యర్థులు సైతం జాగ్రత్త పడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో నిత్యం 300-350 మంది కొవిడ్ బారిన పడుతున్నారు.
అయితే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ సారి ప్రచారం చేసే అభ్యర్థులకు ఇదో ప్రతి బంధకంగా మారనుంది. కొవిడ్ నిబంధనల ప్రకారం ఒకేచోట ఎక్కువ మంది గుమిగూడటానికి ఆస్కారం లేదు. ఒకవేళ ఒకేచోట చేరినా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. దీంతో ఎక్కువ మంది అభ్యర్థులు పరిమిత సంఖ్యలో కార్యకర్తలతో ప్రచారంలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాక పూర్తి స్థాయిలో కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నారు. తప్పనిసరిగా మాస్క్ ధరించడం.. చేతులను శానిటైజ్ చేసుకోవాలి.అయితే, కరోనా నేపథ్యంలో ప్రచారంలో పాల్గొనేందుకు చాలామంది జనం మొగ్గు చూపడంలేదు.
కాగా, ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్కువ మంది అభ్యర్థులు ప్రచారం కోసం సామాజిక మాధ్యమాల బాట పడుతున్నారు. ఓటర్లను కలుసుకోకుండానే ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇంటింటికి కార్యకర్తల ద్వారా సెల్ ఫోన్ నెంబర్లు సేకరించి కమ్యూనికేషన్ పెంచుకుంటున్నారు. కాలనీలు, బస్తీల్లోని 100-200 మందితో గ్రూపులుగా ఏర్పాటు చేసి వాటి ద్వారా తమకే ఓటు వేయాలని ఇప్పటికే కోరుతున్నారు. తాము గెలిస్తే డివిజన్కు ఏమి చేయనున్నామో వాటి ద్వారా చెబుతున్నారు. అటు, ఫేస్బుక్, వాట్సాప్ ఇతర మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు అభ్యర్థులు ఫ్లెక్సీలు, బ్యానర్లు, కరపత్రాలతో ఇంటికి పంచుతూ హోరెత్తించనున్నారు.