రుణగ్రహీతలకు గుడ్ న్యూస్
మారటోరియం ఎత్తివేసే వేళ రుణగ్రహీతలకు బ్యాంకులు బాసటగా నిలవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రుణగ్రహీతల రుణసామర్ధ్యంపై ప్రభావం లేనివిధంగా వ్యవహరించాలని బ్యాంకర్లతో..
మారటోరియం ఎత్తివేసే వేళ రుణగ్రహీతలకు బ్యాంకులు బాసటగా నిలవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రుణగ్రహీతల రుణసామర్ధ్యంపై ప్రభావం లేనివిధంగా వ్యవహరించాలని బ్యాంకర్లను కోరారు. కరోనాతో ప్రభావితమైన వ్యాపార సంస్థలను కాపాడేందుకు సెప్టెంబర్ 15 నాటికి రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆమె సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులతో గురువారం నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. రుణాల పునర్వ్యవస్థీకరణకు బోర్డు ఆమోదించిన విధానాన్ని సత్వరమే అమలు చేసేందుకు బ్యాంకులు సిద్ధం కావాలని ఆమె స్పష్టం చేశారు. ఈ పథకానికి అర్హులైన రుణగ్రహీతలను గుర్తించి సత్వరమే వారిని సంప్రదించి ఆయా వ్యాపారాలను బ్యాంకులు, ఆర్థిక సంస్ధలు కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.
దీనిపై బ్యాంకర్లు ఆర్థిక మంత్రికి పలు అంశాలపై స్పష్టతనిచ్చారు. రుణ పునర్వ్యవస్థీకరణపై తాము పూర్తిసమాచారాన్ని పలు భాషల్లో తమ వెబ్సైట్లపై అందుబాటులో ఉంచామన్నారు. రుణ పునర్వ్యవస్థీకరణకు అర్హులైన రుణగ్రహీతలను గుర్తించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని తెలిపారు. ఇలాఉండగా, కార్పొరేట్, ఎంఎస్ఎంఈ, వ్యక్తిగత రుణం సహా వివిధ రుణగ్రహీతలకు ఆగస్ట్ 6న ఆర్బీఐ రుణ పునర్వ్యవస్థీకరణను ప్రకటించింది. రుణ పునర్వ్యవస్థీకరణ కోసం రుణగ్రహీతలు ఈ ఏడాది డిసెంబర్ 31లోగా బ్యాంకులను కోరవచ్చు.