తెలంగాణకు బస్సు సర్వీసులు.. జగన్ ఏమన్నారంటే
కేబినెట్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంత్రులు పలు అంశాలను తీసుకెళ్లగా.. ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు.
AP Cabinet Meet: కేబినెట్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంత్రులు పలు అంశాలను తీసుకెళ్లగా.. ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణకు బస్సుల రవాణా సమస్యపై మంత్రులు పేర్ని నాని, బొత్స సత్యనారాయణలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మాట్లాడిన జగన్ హైదరాబాద్కి బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక పేకాటపై జైలు శిక్షలను పెంచి కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపుకు సంబంధించి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణి సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. అన్ని శాఖల పరిధిలోని విద్యా సంస్థల్లో ఉద్యోగుల జీతాలను చెల్లించాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో అటవీ అనుమతులు, ఉపాధి హామీ పనులు చేపట్టాలని పుష్ఫ శ్రీవాణి కోరగా.. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అటవీ అనుమతులు తక్షణమే ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కాగా శానిటైజర్లు తాగి పలు చోట్ల మరణిస్తోన్న అంశాన్ని మంత్రులు విశ్వరూప్, నారాయణ స్వామి సీఎంకు తెలిపారు. దీనిపై జగన్ మాట్లాడుతూ.. ప్రస్తుతమున్న మద్యం ధరలపై పూర్తి స్థాయిలో సమీక్ష చేయాలని, శానిటైజర్లు తాగి మరణించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక రోడ్ల నిర్మాణంపై జగన్కి పలువురు మంత్రులు విఙ్ఞప్తి చేశారు. దీనిపై మాట్లాడిన జగన్.. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Read More: