AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా విశ్వరూపం.. అమెరికా గజగజ.. బ్రిటన్ దడ..దడ.. ఇంకా ….

కరోనా భూతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనాలో ప్రారంభమైన ఈ వైరస్ ఆ దేశంలో అదుపులో ఉండగా ఇతర దేశాల్లో మాత్రం తన ప్రతాపం చూపుతోంది.

కరోనా విశ్వరూపం.. అమెరికా గజగజ.. బ్రిటన్ దడ..దడ.. ఇంకా ....
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 16, 2020 | 5:36 PM

Share

కరోనా భూతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనాలో ప్రారంభమైన ఈ వైరస్ ఆ దేశంలో అదుపులో ఉండగా ఇతర దేశాల్లో మాత్రం తన ప్రతాపం చూపుతోంది.  వాషింగ్టన్ సహా అమెరికాలోని అతి పెద్ద నగరాల్లో దాదాపు కర్ఫ్యూ వాతావరణం నెలకొంటోంది. లాస్ ఏంజిలిస్, న్యూయార్క్, కాలిఫోర్నియా, ఓహియో, ఇల్లినాయిస్, మసాచ్యూ సెట్స్ వంటి సిటీల్లో బార్లు, రెస్టారెంట్లు, స్కూళ్ళు, సినిమా హాళ్లు, యూనివర్సిటీలను మూసివేయాలని  ఆదేశించారు.ప్రజలు కనీసం 8 వారాలపాటు ఎక్కడా గుమికూడరాదని అధికారులు సూచించారు. కరోనా భయంతో వీటినన్నిటిని మూసివేస్తుండడంతో లక్షలాది సిబ్బంది భవితవ్యం అయోమయంలో పడింది. కరోనా అదుపులోనే ఉందని అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు పెన్స్ చెబుతున్నప్పటికీ.. పరిస్థితి మాత్రం అందుకు విరుధ్ధంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాధికి గురై మరణించిన వారి సంఖ్య ఆరున్నర వేలకు పైగా పెరగగా.. సుమారు రెండు లక్షల 70 వేల మందికి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ సోకినట్టు అంచనా.

బ్రిటన్ లో కరోనా రోగులు 35 మంది మృతి చెందారు. ఒక్కరోజులోనే 14 డెత్ కేసులు నమోదయ్యాయి. కరోనా టెస్టులు చేయించుకోవడానికి ఎవరైనా నిరాకరించిన పక్షంలో.. పోలీసుల సాయంతో బలవంతంగా వారిని ఐసొలేషన్ వార్డులకు తరలిస్తున్నారు. వారికి వెయ్యి పౌండ్ల జరిమానా కూడా విధిస్తున్నారు. లండన్ తదితర నగరాల్లో ప్రయాణికులు లేక రైళ్లు, బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయి. బ్రిస్టల్ మొదలైన సిటీల్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.  బ్రిటన్లో పబ్ లు, రెస్టారెంట్లను మూసివేశారు.

యూరప్ లో 10 లక్షల మందిపై వైద్య సంబంధ నిఘా ఉంచారు. జర్మనీ, ఫ్రాన్స్, పోలండ్ తమ సరిహద్దులను మూసివేశాయి. స్లొవేకియాలో ఎమర్జన్సీ ప్రకటించారు. అక్కడ సుమారు రెండు వేల మందికి కరోనా ఇన్ఫెక్షన్ సోకినట్టు అనుమానిస్తున్నారు.

ఇటలీలో 80 ఏళ్ళకు మించినవారిలో ఎవరైనా కరోనాకి గురైతే వారికి చికిత్స అందించకుండా వదిలేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. దేశం అత్యంత సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటోందని ప్రధాని గిసెప్పీ కాంటే వ్యాఖ్యానించారు. ఈ వ్యాధి సోకినవారిలో ఎవరికి చికిత్స చేయాలో, ఎవరికి చేయకూడదో నిర్ణయించుకునే హక్కును డాక్టర్లకే ఇచ్ఛేశారు.