చైనా పన్నాగం.. చర్చల ముసుగులో భారీ కుట్ర..!

భారత్-చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న పరిస్థితులు మరింత జఠిలంగా మారుతున్నాయి. గత కొద్దిరోజులుగా శాంతి పునరుద్ధరణ కోసం భారత్ ప్రయత్నిస్తుండగా.. చర్చల్లో పాల్గొంటూనే చైనా భారీ కుట్రకు తెరలేపింది.

చైనా పన్నాగం.. చర్చల ముసుగులో భారీ కుట్ర..!
Follow us

|

Updated on: Sep 02, 2020 | 5:09 PM

భారత్-చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న పరిస్థితులు మరింత జఠిలంగా మారుతున్నాయి. గత కొద్దిరోజులుగా శాంతి పునరుద్ధరణ కోసం భారత్ ప్రయత్నిస్తుండగా.. చర్చల్లో పాల్గొంటూనే చైనా భారీ కుట్రకు తెరలేపింది. చర్చలకు మోకాలడ్డుతూ.. అదే సమయంలో సరిహద్దు వెంబడి భారీగా సైన్యాలను మోహరింస్తున్నది. ఎల్ఏసీ సమీపంలోని ప్రాంతాలను కన్నేసి ఆక్రమించేందుకు చైనా ఎత్తుగడలు సిద్ధం చేసినట్లు తెలిసింది. సరిహద్దుల వెంబడి మరింతగా బలపడ్డ డ్రాగన్.. ఇండియాను ముంట్టడించేంత స్థాయిలో ఏర్పాట్లు చేసుకుందంటే సరిహద్దులో సిట్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

లఢాఖ్‌ వద్ద ఎల్‌ఏసీ వెంబడి పలు ప్రదేశాల్లో భారత్‌కు చెందిన దాదాపు వెయ్యి చదరపు కిలోమీటర్ల భూభాగం చైనా ఆక్రమణలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించినట్లు ‘ద హిందూ’ పత్రిక వెబ్‌సైట్‌లో ఓ కథనం ప్రచురితమైంది. ఆ కథనం ప్రకారం.. దెప్సాంగ్‌ నుంచి చుశుల్‌ వరకు ఈ ఆక్రమణలు జరిగాయి. దెప్సాంగ్‌ మైదానంలో పెట్రోలింగ్‌ పాయింట్‌ 10 నుంచి 13 వరకు 900 చదరపు కిలోమీటర్లు చైనా నియంత్రణలోకి వెళ్లిపోయాయి. గల్వాన్‌ లోయలో 20 చదరపు కిలోమీటర్లు, హాట్‌స్ర్పింగ్‌ ప్రాంతంలో 12 చదరపు కిలోమీటర్లు, పాంగాంగ్‌ వద్ద 65 చదరపు కిలోమీటర్లు, చుశుల్‌ వద్ద 20 చదరపు కిలోమీటర్లను చైనా ఆక్రమించింది. తాజాగా పాంగాంగ్‌ వద్ద ఉన్న ఫింగర్‌-4 నుంచి ఫింగర్‌-8 వరకు ఎనిమిది కిలోమీటర్ల పొడవున ఉన్న భూభాగంపై చైనా కన్నేసిందని ఆ అధికారి వివరించినట్లు ‘ద హిందూ’ కథనం పేర్కొంది.

మరోవైపు, ఫలితం లేని చర్చలతో కాలయాపన చేస్తోన్న చైనా.. అదే సమయంలో సీక్రెట్ గా తన భారీ వాహన శ్రేణులతో సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని భారత్ సరిహద్దు వరకు చేరవేసింది. అదేసమయంలో చైనా సైనికులు.. భారత సరిహద్దులోకి చొచ్చుకొచ్చే ప్రయత్నాలు కూడా పెరిగిపోయాయి.

కాగా, చైనా కుట్రలు బట్టబయలు కావడంతో భారత్ మరింత అప్రమత్తమైంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున సైనిక బలగాలను చైనా సరిహద్దుల్లో మోహరింపజేసే పనిని వేగవంతం చేసింది. ప్రస్తుతం ఉద్రిక్తత నెలకొన్న తూర్పు లదాక్, సిక్కింలోనే కాకుండా సరిహద్దు వెంబడి అన్ని కీలక పాయింట్ల వద్ద సైన్యాన్ని దింపాలని భారత్ డిసైడైంది. ఇవతలికి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన చైనా సైనికులను.. భారత బలగాలు గట్టిగా నిలువరిస్తున్నాయని విశ్వసనీయంగా తెలిసింది.