AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాబోయే రోజులు ప్రాంతీయపార్టీలకు గడ్డు కాలమే!

ప్రధాని నరేంద్రమోదీకి తిరుగులేదని మొన్నీమధ్య ఓ సర్వేలో స్పష్టమైంది..మోదీకి ఇంతటి ప్రజాదరణ ఉన్నా . అలాగని కొన్ని రాష్ట్రాలలో భారతీయ జనతాపార్టీకి బలంగా ఉందని అనుకోవడానికి లేదు..

రాబోయే రోజులు  ప్రాంతీయపార్టీలకు గడ్డు కాలమే!
Balu
|

Updated on: Aug 17, 2020 | 2:41 PM

Share

ప్రధాని నరేంద్రమోదీకి తిరుగులేదని మొన్నీమధ్య ఓ సర్వేలో స్పష్టమైంది..మోదీకి ఇంతటి ప్రజాదరణ ఉన్నా . అలాగని కొన్ని రాష్ట్రాలలో భారతీయ జనతాపార్టీకి బలంగా ఉందని అనుకోవడానికి లేదు.. బీహార్‌లో నితీశ్‌కుమార్‌తో కలిసి ఎన్నికలలో యుగళగీతం పాడటానికి ఇదో కారణం కావచ్చు.. ఇటీవలి కాలంలో జార్ఖండ్‌, మహారాష్ట్ర, హర్యానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీకి ఎదురుదెబ్బలే తగిలాయి.. దాన్ని దృష్టిలో పెట్టుకుని.. రిస్క్‌ తీసుకోవడం ఎందుకని అమిత్‌షా భావించారేమో తెలియదు.. ఇదే భావనను కొందరు బీజేపీ పెద్దలు కూడా వ్యక్తపరిచారు. 2015లో ఏర్పడినట్టు జనతాదల్‌ యునైటెడ్‌, కాంగ్రెస్‌, రాష్ట్రీయ జనతాదళ్‌ కూటమి మరోసారి ఏర్పడకూడదన్నదే అమిత్ షా వ్యూహంలా కనిపిస్తోంది.. అందుకే ఈ ఎన్నికల్లో కూడా నితీశ్‌కుమార్‌నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ అధినాయకత్వం.

తమవారిని కాదని వేరే పార్టీకి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడం అమిత్‌షాకు అంతగా ఇష్టం ఉండదు.. కాకపోతే అమిత్ షా వ్యూహం వేరే ఉన్నదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.. అసలు అమిత్ షా ప్రాధాన్యతలు వేరే! రాష్ట్రీయ జనతాదళ్‌ను పూర్తిగా పరిసమాప్తం చేయడమే అమిత్‌ షా లక్ష్యం. ఈ ఎన్నికల్లో ఆర్‌జేడీ ఓటమి పాలైతే మాత్రం షా కోరిక సగం నెరవేరినట్టే అవుతుంది.. చాన్నాళ్లుగా అధికారానికి దూరంగా ఉండటంతో ఆ పార్టీలోని ప్రముఖ నేతలంతా నెమ్మదిగా జారుకుంటున్నారు. కొందరు పార్టీ అధినాయకత్వంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఆర్‌జేడీకి అధికారం దక్కకపోతే యాదవ సామాజికవర్గం బీజేపీ దరి చేరడం ఖాయమని కమలం పార్టీ లెక్కలేసుకుంటోంది..

ఎంతకాదనుకున్నా నితీశ్‌కుమార్‌కు ఈ ఎన్నికలు ఓ అగ్ని పరీక్షలాంటివి.. 69 ఏళ్ల నితీశ్‌ తన చివరి పొలిటికల్‌ ఇన్నింగ్స్‌ ఆడబోతున్నారు.. పార్టీలో నితీశ్‌ తర్వాత ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం లేదు.. నితీశ్‌కుమార్‌ లేకపోతే జేడీయూ లేదు. నితీశ్‌ తర్వాత జేడీయూ ఉంటుందన్న నమ్మకమూ లేదు.. రాష్ట్రీయ జనతాదళ్‌ది ఇంచుమించు ఇదే పరిస్థితి.. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తనయులు పార్టీని పదిలంగా కాపాడుకోగలరా అన్న సందేహం చాలామందిని వెంటాడుతోంది.. బీజేపీ ఈ సువర్ణావకాశం కోసమే ఎదురుచూస్తున్నది.. బీహార్‌లో బలంగా పాతుకుపోయిన ఈ రెండు ప్రాంతీయపార్టీలను దెబ్బతీస్తే భవిష్యత్తంతా తమదేనన్న భావనలో బీజేపీ ఉంది.

ఒడిషాలోనూ ఇదే పరిస్థితి.. అక్కడ అధికారంలో ఉన్న నవీన్‌ పట్నాయక్‌ సారథ్యంలోని బిజూ జనతాదళ్‌కు బ్రహ్మండమైన ప్రజాదరణ ఉందన్నది కాదనలేని నిజం.. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీని పక్కన పెట్టి బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. అలాంటప్పుడు భవిష్యత్తులో నవీన్‌ పట్నాయక్‌తో చేతులు కలిపి ఎలా పయనిస్తుంది? రాష్ట్రంలో బలోపేతం కావడంపైనే దృష్టి పెడుతుందే తప్ప ప్రాంతీయపార్టీపై ఆధారపడదు.. వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతుంది.. ఇప్పుడు బీజేపీ పెద్దలు అదే చేస్తున్నారు. అవకాశం కూడా ఎదురుచూస్తున్నారు..వచ్చే అక్టోబర్‌లో నవీన్‌ పట్నాయక్‌కు 74 వసంతాలు నిండుతాయి.. ఆయనకు కూడా వచ్చే ఎన్నికలు రాజకీయంగా జీవన్మరణ పోరాటమే! ఆ ఎన్నికల్లో బిజూ జనతాదళ్‌ అధికారంలోకి రాకపోతే మాత్రం ఆ పార్టీ మనుగడ కష్టమే! పట్నాయక్‌ తర్వాత పార్టీలో అంత జనాదరణ ఉన్న నాయకుడు ఎవరూ లేరు.. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేడీలో పాపులర్‌ నాయకుడైన బైజయంత్‌ పాండాను అక్కున చేర్చుకుని ఆయనకు రాజ్యసభ టికెట్‌ ఇచ్చింది బీజేపీ.. అలా బీజూ జనతాదళ్‌కు చెందిన కొందరు కమలంవైపుకు ఆకర్షితులయ్యేలా చేసింది.. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే వ్యూహాన్ని అమలు చేయాలనుకుంటోంది. పైగా బీజేడీని చీల్చడం బీజేపీకి పెద్ద విషయం కాదు కూడా! రెండు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తూ వస్తున్న బీజేడీకి రాబోయేది గడ్డు కాలమే.

ప్రాంతీయపార్టీల ప్రభావాన్ని, ప్రాభవాన్ని తగ్గించాలన్నదే మోదీ, అమిత్‌షాల లక్ష్యం.. ఆ దిశగానే వారి వ్యూహాలు ఉంటున్నాయి.. అయితే ఇప్పటికిప్పుడు ప్రాంతీయపార్టీలను అణగదొక్కే ప్రయత్నం చేయరు వారు.. కారణం రాజ్యసభలో ఎన్‌డీఏకు స్పష్టమైన మెజారిటీ ఇంకా రాలేదు కాబట్టి.. 245 సభ్యులున్న రాజ్యసభలో బీజేపీకి చెందిన వారు 85 మందే ఉన్నారు.. ఆ మాటకొస్తే కాంగ్రెస్‌కు ఉన్నది 40 మందే! బీజేపీకి దూరంగా ఉంటున్న లెఫ్ట్‌ పార్టీలు, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎన్‌సీపీ, టీడీపీ, జార్ఖండ్‌ ముక్తి మోర్చా .. మరికొన్ని ప్రాంతీయ పార్టీల ఎంపీలను కాంగ్రెస్‌ కూడబెట్టుకున్నా ఎన్‌డీఏ సంఖ్యను అధగమించలేదు.. అయినప్పటికీ ఎన్‌డీఏకు మెజారిటీ మార్క్‌కు 12 సీట్లు తక్కువున్నాయి..మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు ఉబలాటపడుతున్న విపక్ష సభ్యులు కూడా ఎక్కువే ఉన్నారక్కడ.. ఎంతకాదనుకున్నా లెక్కల ప్రకారం రాజ్యసభలో మెజారిటీ లేదు కాబట్టే బీజేపీ ఇప్పుడు ప్రాంతీయపార్టీలపై వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తూ వస్తోంది..అక్కడ కూడా మెజారిటీ వచ్చిన తర్వాత ప్రాంతీయపార్టీలతో బీజేపీ ఆట మొదలవుతుంది..

Follow Us