న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందంపై కాగ్ నివేదిక ఎట్టకేలకు రాజ్యసభకు చేరింది. కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి రాధాకృష్ణన్ దీన్ని రాజ్యసభలో దీన్ని ప్రవేశపెట్టారు. ఈ రిపోర్ట్ ఎన్డీఏకు సంతోషం కలిగించేదిగా ఉంది. యూపిఏ కన్నా ఎన్డిఏ ఒప్పందం బెటర్గా ఉన్నట్టు ఈ రిపోర్ట్ తేల్చింది. యూపిఎ కన్నా ఎన్డిఏ జరిపిన రఫేల్ ఒప్పందం 2.85% తక్కువ ధరకు ఉందని వివరించింది. యుపిఏ 126 యుద్ధ విమానాల కోసం చర్చలు జరపగా ఎన్డిఏ 36 యుద్ధ విమానాల కోసం ఒప్పందం ఫ్రెంచ్ ప్రభుత్వంతో చేసింది.
తమ హయాంలో కంటే బిజెపి హయాంలో భారీ ధరకు రఫేల్ ఒప్పందం జరిగిందని, తద్వారా దేశానికి పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లిందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్న రాజీవ్ మెహర్షిపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఆర్ధిక కార్యదర్శిగా ఉన్న ఆయన రఫేల్ ఒప్పందంలో కీలకంగా వ్యవహరించారని, అలాంటి వ్యక్తి విడుదల చేసిన కాగ్ రిపోర్ట్పై తమకు విశ్వసనీయత లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.