రైతు చట్టాల ‘సెగ’, ఎన్డీయే నుంచి వైదొలగుతున్నాం’, రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ నేత హనుమాన్ బేనివాల్ ప్రకట, ఇక ప్రత్యక్ష పోరు
రైతు చట్టాల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. ఆందోళన చేస్తున్న అన్నదాతలకు మద్దతునిస్తున్న లోక్ తాంత్రిక్ పార్టీ (ఆర్ ఎల్ పీ ) తాము ఎన్డీయే నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది. బీజేపీకి మిత్ర పక్షమైన ఈ పార్టీ చీఫ్ హనుమాన్ బేనివాల్..
రైతు చట్టాల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. ఆందోళన చేస్తున్న అన్నదాతలకు మద్దతునిస్తున్న లోక్ తాంత్రిక్ పార్టీ (ఆర్ ఎల్ పీ ) తాము ఎన్డీయే నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది. బీజేపీకి మిత్ర పక్షమైన ఈ పార్టీ చీఫ్ హనుమాన్ బేనివాల్ ఈ నిర్ణయాన్ని వెల్లడిస్తూ ఎన్డీయేకి గుడ్ బై చెబుతున్నామని, ‘ఐయామ్ బ్రేకింగ్ ఎవే ‘ అని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలపై ఎన్డీయే నుంచి వైదొలగిన శిరోమణి అకాలీదళ్ తరువాత ఆర్ ఎల్ పీ రెండో పార్టీ అయింది. తాను తీసుకున్న నిర్ణయంపై బేనివాల్ వివరిస్తూ తను లేనప్పుడు రైతు చట్టాలను లోక్ సభలో ప్రవేశపెట్టారని, సభలో తను ఉండి ఉంటే ఈ చట్టాల ప్రతులను చించి పారవేసేవాడినని అన్నారు. ఆసమయంలో నేను కోవిడ్ బారిన పడ్డానని అన్నారు. రాజస్తాన్ లోని నాగౌర్ కు చెందిన ఈ ఎంపీ సింఘు బోర్డర్ లో ఆందోళన చేస్తున్న అన్నదాతలకు మద్దతుగా తమ రాష్ట్రం నుంచి రెండు లక్షలమంది రైతులను సమీకరించానని తెలిపారు. అంతకుముందు జైపూర్, నాగౌర్,బార్మర్, జోధ్ పూర్ నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కోట్ పుత్లీ వరకు జరిగిన భారీ ర్యాలీకి బేణీవాల్ నాయకత్వం వహించారు. బీజేపీకి 303 మంది ఎంపీలు ఉన్నందువల్లే మోదీ ప్రభుత్వం ఈ చట్టాలను ఉపసంహరించుకోవడంలేదని ఆయన విమర్శించారు.
ఇటీవలే ఈయన తను సభ్యుడిగా ఉన్న మూడు పార్లమెంటరీ కమిటీలకు కూడా రాజీనామా చేశారు. లోగడ కూడా హనుమాన్ బేణీవాల్ బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ఎన్డీయే లో కొనసాగడంపై తాము పునరాలోచించుకోవలసి ఉంటుందన్నారు.