Dhoni Birthday: ఎంస్ ధోనీ బర్త్‌డే స్పెషల్.. కెప్టెన్‌గా మహీ సాధించిన ఐదు గొప్ప రికార్డులు ఇవే..

Dhoni Birthday: భారత క్రికెటర్లలోనే కాదు.. ప్రపంచ క్రికెటర్లలోనే దిగ్గజంగా గుర్తింపు పొందిన భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్..

Dhoni Birthday: ఎంస్ ధోనీ బర్త్‌డే స్పెషల్.. కెప్టెన్‌గా మహీ సాధించిన ఐదు గొప్ప రికార్డులు ఇవే..
Ms Dhoni
Follow us

|

Updated on: Jul 07, 2021 | 12:50 PM

Dhoni Birthday: భారత క్రికెటర్లలోనే కాదు.. ప్రపంచ క్రికెటర్లలోనే దిగ్గజంగా గుర్తింపు పొందిన భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇవాళ తన 40వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నాడు. ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఏడాది దాటింది. అయితే, క్రికెట్‌కు గుడ్ బై చెప్పినప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ధోనీని తలుచుకోకుండా ఉండలేరంటే అతిశయోక్తికాదు. కారణం.. అతని ఆట శైలి, అతని నడవడిక, అతని నిర్ణయాలు అని చెప్పాలి. మొత్తంగా మిస్టర్ కూల్‌గా గుర్తింపు పొందిన ఎంఎస్ ధోనీ.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు దూరమైనా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కొనసాగుతూ వస్తున్నాడు. ప్రస్తుతం చైన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

కాగా, ఎంస్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియా దేశ, విదేశాల్లో ఎన్నో అద్భుత విజయాలను సాధించింది. అన్ని ఫార్మాట్లలో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి ధోని రికార్డ్ సృష్టించాడు. అంతేకాదు.. మూడు ఐసిసి ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్‌గా ధోనీ నిలిచాడు. ధోనీ సారధ్యంలోనే టీమిండియా వన్డే ప్రపంచ కప్(2011), టీ20 ప్రపంచ కప్(2007), ఛాంపియన్స్ ట్రోఫీ(2013) లను గెలుచుకుంది.

ఈ విజయాలతో అద్భుతమైన వికెట్ కీపర్‌గా, విజయవంతమైన ఫినిషర్‌గానే కాకుండా.. ధోనీ అసాధారణమైన కెప్టెన్‌గానూ నిలిచాడు. నిర్ణయాల్లో వేగం.. ఆటలో చురుకుదనం.. నిర్మలమైన మనస్సు.. ఆటలోని మెళకువలు అన్నీ కలగలిపి ధోనీని స్మార్ట్ కెప్టెన్‌గా మార్చాయి. కష్ట సమయంలో ముందుండి పోరాడటం ధోనీకి అలవాడు. అలాంటి ధోనీ కెప్టెన్సీలో టీమిండియా అనేక మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కాగా, ధోనీ 40 పుట్టిన రోజు సందర్భంగా ప్రతీ భారతీయుడు గర్వించదగిన.. ఈ మాజీ కెప్టెన్ సాధించిన ఐదు గొప్ప విజయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1) 2011 వన్డే ప్రపంచ కప్ విజయం.. భారత క్రికెట్ చరిత్రలో మరపురాని విజయాలలో ఈ విజయం ఒకటి. 2011లో ధోనీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 275 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించాల్సి ఉంది. ఆ మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ (97), ధోని (91) భారీ పరుగులు చేశారు. మొత్తంగా ఆరు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రెండో ప్రపంచ కప్ కోసం 28 సంవత్సరాల నిరీక్షణకు ఫలితం దక్కినట్లయ్యింది.

2) 2007లో టి20 ప్రపంచ కప్‌ విజయం.. ఐసిసి టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు టీమిండియా కెప్టెన్‌గా ధోనీని సెలక్ట్ చేశారు. ఈ టోర్నమెంట్ మొత్తానికి కెప్టెన్‌గా వ్యవహరించిన దోనీ.. అద్భుతమై సారథ్యాన్ని అందించాడు. ఫైనల్‌లో పాకిస్తాన్‌పై విజయానికి ధోనీ సారథ్యమే కారణమని చెప్పాలి. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ వంటి సీనియర్లు లేని ఆ మ్యాచ్‌లో ధోనీ అన్నీ తానై నిలిచాడు. 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను మట్టికరిపించి తొలి ట్రోపీని కైవసం చేసుకుంది భారత జట్టు.

3) 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం.. 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్-ఇంగ్లండ్ తలబడ్డాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ క్లాస్ కెప్టెన్సీ బయటపడింది. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా కేవలం 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. అలాంటి సమయంలో ధోనీ తీసుకున్న నిర్ణయాలే భారత జట్టును విజయ తీరాలకు చేర్చింది. బౌలింగ్ కీలక మార్పులు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు ధోనీ. వికెట్ కీపర్‌గా ఫుల్ స్వింగ్‌లో ఉంటూనే.. బౌలర్లకు సరైన సమయంలో సరైన ట్రిక్స్ చెబుతూ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు మహీ. ఇంగ్లండ్ దూకుడు స్పిన్నర్లతో చెక్ పెట్టేశాడు. మొత్తానికి 124/8తో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి ట్రోఫీని కైవసం చేసుకుంది ధోనీ సారథ్యంలోని టీమిండియా.

4) ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్‌లో అగ్రస్థానానికి ఇండియా.. 2009లో ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు అగ్రస్థానం దక్కడం కెప్టెన్ ధోనీ పాత్ర కీలకం అని చెప్పాలి. 2001 లో ర్యాంకింగ్స్ ప్రారంభమైనప్పటి నుండి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మాత్రమే టెస్టుల్లో ఫస్ట్ ప్లేస్‌లో నిలుస్తూ వచ్చాయి. కానీ, ధోనీ సారథ్యంలో టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంది. 2009లో టీమిండియా థర్డ్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తరువాత ఫస్ట్ ప్లేస్‌కు చేరుకుంది.

5) కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు.. అన్ని ఫార్మాట్లలో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ పేరిట ఉన్న రికార్డ్‌ను తిరగరాశాడు ఎంఎస్ ధోనీ. రికీ పాంటింగ్ మొత్తం 324 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించగా.. ధోనీ 332 మ్యాచ్‌లో టీమిండియాకు సారథిగా నిలిచాడు. ఇక ధోనీ కెప్టెన్సీలో టీమిండియా 178 మ్యాచ్‌లు గెలవగా.. 120 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 15 డ్రా గా అవగా.. వీటిల్లోనూ 6 టైతో ముగిశాయి. ఇక 200 వన్డే మ్యాచ్‌ల్లో 110 మ్యాచ్‌లు గెలిచి అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా ధోనీ రికార్డులకెక్కాడు.

Also read:

AP Housing Scheme: ఇళ్ల నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వ గుర్తు ఉంటే తప్పేంటి?.. ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి సూటి ప్రశ్న..

Tirupati Kidnap Case: నాలుగు నెలల వేట ఫలితం దక్కింది.. నాడు తప్పించుకున్నాడు.. నేడు అడ్డంగా దొరికిపోయాడు..

Auto-Rickshaw Race: చెన్నై రోడ్లపై ఆటో రేస్.. హడలిపోయిన ప్రయాణికులు.. సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్..