Pregnancy Health : గర్భస్రావానికి దారితీసే పొరపాటు.. గర్భిణులు వీటి జోలికి వెళ్లకపోవడమే బెటర్..
పాలు కాల్షియం ప్రోటీన్లకు నిలయం. కానీ, గర్భిణీలు తాగే పాలు పచ్చివి అయితే మాత్రం అది పెను ప్రమాదానికి దారి తీయవచ్చు. మరిగించని పాలలో ఉండే హానికర బ్యాక్టీరియా తల్లికి మాత్రమే కాదు, గర్భంలోని బిడ్డకు కూడా ప్రాణసంకటంగా మారుతుంది. పచ్చి పాలు ఎందుకు తాగకూడదు? వీటి గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిపుణులు ఏం సూచిస్తున్నారు? వివరాలు ఈ కథనంలో..

గర్భధారణ సమయంలో తీసుకునే ఆహారం విషయంలో చిన్న పొరపాటు జరిగినా అది పెద్ద సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా చాలా సార్లు ఫుడ్ పాయిజనింగ్, విరేచనాలు, వాంతుల వంటివి తల్లి బిడ్డ ప్రాణాలకు ప్రమాదం. పాలు ఆరోగ్యానికి మంచివి కదా, పచ్చిగా తాగితే ఇంకా బలం వస్తుంది అనుకుంటే అది పొరపాటే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఎందుకు ప్రమాదకరం?
గర్భధారణ సమయంలో తల్లి రోగనిరోధక శక్తి సహజంగానే కొంత తగ్గుతుంది. పచ్చి పాలను మరిగించనప్పుడు అందులో ఉండే లిస్టీరియా వంటి బ్యాక్టీరియా త్వరగా శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది. ఇది నేరుగా గర్భాశయంపై ప్రభావం చూపి, అకాల ప్రసవం (Pre-term labor) లేదా గర్భస్రావానికి దారి తీయవచ్చు.
బిడ్డపై ప్రభావం ఎలా ఉంటుంది?
తల్లికి సోకిన ఇన్ఫెక్షన్ ప్లేసెంటా ద్వారా శిశువుకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. దీనివల్ల శిశువు పుట్టకతోనే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో పుట్టవచ్చు లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు.
పాస్చరైజేషన్ ఎందుకు ముఖ్యం?
పాలను అధిక ఉష్ణోగ్రత వద్ద మరిగించడం వల్ల అందులోని పోషకాలు దెబ్బతినకుండానే హానికర సూక్ష్మజీవులు నశిస్తాయి. అందుకే మార్కెట్లో లభించే పాస్చరైజ్డ్ పాలు లేదా ఇంట్లో బాగా మరిగించిన పాలు మాత్రమే గర్భిణీలకు సురక్షితం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
పచ్చి పాలతో చేసిన చీజ్ లేదా ఇతర పాల పదార్థాలకు దూరంగా ఉండాలి.
ఫ్రిజ్లో ఉన్న పాలను కూడా గడువు తేదీ చూసుకుని, మళ్లీ మరిగించి వాడటం ఉత్తమం.
పాల ఉత్పత్తులు కొనేటప్పుడు లేబుల్పై ‘Pasteurized’ అని ఉందో లేదో సరిచూసుకోవాలి.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. వీటిని పాటించే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.
