Coconut Water: వేడి కొబ్బరి నీళ్లతో క్యాన్సర్‌కు చెక్‌ పెట్టవచ్చా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

|

Nov 10, 2022 | 6:55 AM

వేడి కొబ్బరి నీరు "క్యాన్సర్ నిరోధక పదార్థాన్ని" విడుదల చేస్తుందని.. "క్యాన్సర్ సమర్థవంతమైన చికిత్సలో తాజా పురోగతి" అంటూ వాట్సప్‌లో ఇటీవల వైరల్‌ అవుతున్న సందేశం పేర్కొంది.

Coconut Water: వేడి కొబ్బరి నీళ్లతో క్యాన్సర్‌కు చెక్‌ పెట్టవచ్చా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Coconut Water
Follow us on

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం తప్పుడు సమాచారం, నకిలీ వార్తలకు వేదికగా మారుతోంది. ముఖ్యంగా కరోనావైరస్‌ నాటి నుంచి సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తిచెందుతోంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే ఇది ప్రమాదకరంగా మారుతోందని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. తాజాగా ఆరోగ్యానికి సంబంధించిన తప్పుడు సమాచారం వైరల్‌ అవుతోంది. ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ రాజేంద్ర ఎ బద్వే పేరుతో.. వేడి కొబ్బరి నీరు క్యాన్సర్‌ను నయం చేస్తుందని పేర్కొంటూ ఒక వైరల్ సందేశం వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. అది నకిలీదని ది హిందూ వార్త సంస్థ నివేదించింది.

ఈ సంవత్సరం ప్రారంభంలో అదే సందేశం Facebook లో ప్లాట్‌ఫాంలో వైరల్ అయింది. అయితే ఈ పోస్ట్ మార్చి 2019లో మొదటిసారి వైరల్‌ అయినట్లు ఫ్యాక్ట్‌ చెక్‌లో తేలింది. ఇప్పుడు WhatsAppలో మళ్లీ తెరపైకి వచ్చింది.

వేడి కొబ్బరి నీరు “క్యాన్సర్ నిరోధక పదార్థాన్ని” విడుదల చేస్తుందని.. “క్యాన్సర్ సమర్థవంతమైన చికిత్సలో తాజా పురోగతి” అంటూ వాట్సప్‌లో ఇటీవల వైరల్‌ అవుతున్న సందేశం పేర్కొంది. “కొబ్బరి సారంతో ఈ రకమైన చికిత్స ప్రాణాంతక కణాలను మాత్రమే నాశనం చేస్తుంది, ఇది ఆరోగ్యకరమైన కణాలను ప్రభావితం చేయదు” అంటూ రాసి ఉంది.

ఇవి కూడా చదవండి

సోషల్‌ మీడియాలో ఈ సందేశం వైరల్ అవుతుండటంతో టాటా మెమోరియల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సిఎస్ ప్రమేష్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ సందేశం అశాస్త్రీయమైనది.. డాక్టర్ బద్వే ఎప్పుడూ చెప్పలేదు.. అంటూ స్పష్టంచేశారు. వేడి కొబ్బరి నీరు అలాంటి చికిత్సకు పనికి రావని.. ఇదంతా అబద్దమంటూ కొట్టిపారేశారు.

అంతకుముందు ఆవు మూత్రం క్యాన్సర్‌ను నయం చేయగలదని సూచించిన మరొక ఉదాహరణను కూడా చెప్పారు. దానిని సూచించడానికి ఎలాంటి డేటా లేదని.. అలాంటి పద్ధతులపై ఆధారపడటం చాలా ప్రమాదకరం అంటూ డాక్టర్ ప్రమేష్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో అన్నారు.

ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ దేశంలోని ప్రముఖ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్‌లలో ఇది ఒకటి.. ఇది కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తిని ఎదుర్కొంటోంది.

“ఒక వైద్యుడు లేదా సంస్థకు ఆపాదించడం ద్వారా వారు నివారణను ధృవీకరిస్తున్నారని దుర్మార్గులు భావిస్తున్నారు” అని ముంబైలోని ఆసియన్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఆంకోసర్జన్ డాక్టర్ రమాకాంత్ దేశ్‌పాండే ది హిందూతో అన్నారు. ఈ తప్పుడు సమాచారం వ్యాప్తి చాలా హానికరమని తెలిపారు. ఆంకాలజిస్టులు ఇలాంటి మెసేజ్‌ల గురించి పదేపదే హెచ్చరిస్తున్నారు.. ఇవి కేవలం పుకార్లు మాత్రమేనని తెలిపారు.

భారతదేశంలో క్యాన్సర్‌ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ 2022 నివేదిక ప్రకారం.. భారతదేశంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య 2021లో 26.7 మిలియన్లుగా ఉంది. ఇది 2025 నాటికి 29.8 మిలియన్లకు పెరుగుతుందని అంచనా వేసింది.

Source Link

మరిన్ని హెల్త్ వార్తల కోసం..