Heart Health: గుండెపోటుకు 2 రోజుల ముందు కనిపించే లక్షణాలివి.. వీటితో జాగ్రత్త!
గుండెపోటు అకస్మాత్తుగా వస్తుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ, అది నిజం కాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గుండెపోటు రాకముందే, కొన్ని రోజుల ముందు నుంచే మన శరీరం కొన్ని హెచ్చరిక సంకేతాలను ఇస్తుందని పలు అధ్యయనాలు రుజువు చేశాయి. ముఖ్యంగా మహిళలు, వృద్ధులలో ఈ లక్షణాలు తరచుగా కనిపించినా, చాలా మంది వాటిని విస్మరిస్తుంటారని వైద్యులు చెబుతున్నారు. ఛాతీలో మంట, ఎసిడిటీ అనుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు.

గుండె ధమనులలో కొవ్వు, కొలెస్ట్రాల్ వంటి పదార్థాలు పేరుకుపోవడం వల్ల రక్త నాళాలు మూసుకుపోతాయని డాక్టర్ గైక్వాడ్ వివరించారు. ఈ పేరుకుపోయిన పదార్థాలను ప్లాక్ (Plaque) అంటారని, ఇది ఒక్కోసారి చీలి రక్తం గడ్డకట్టడానికి దారితీస్తుందని, తద్వారా గుండెకు రక్త ప్రవాహం నిలిచిపోతుందని ఆయన తెలిపారు. గుండెపోటుకు కనీసం కొన్ని రోజుల ముందు నుంచే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్ గైక్వాడ్ స్పష్టం చేశారు.
“గుండెపోటుకు కొన్ని రోజుల లేదా కొన్ని గంటల ముందు శరీరం హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది. ఈ లక్షణాలు తరచుగా తేలికపాటివిగా ఉంటాయి, ముఖ్యంగా మహిళలు మరియు వృద్ధులలో వీటిని చాలా మంది విస్మరిస్తారు. కొందరు వీటిని ఎసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్ వల్ల అనుకుని పట్టించుకోరు” అని డాక్టర్ గైక్వాడ్ వివరించారు.
గుండెపోటుకు రెండు రోజుల ముందు కనిపించే సాధారణ లక్షణాలు:
ఛాతీ నొప్పి: ఛాతీలో ఒత్తిడి, బిగుతుగా అనిపించడం లేదా నొప్పి.
నొప్పి వ్యాప్తి: భుజాలు, చేతులు, వీపు, మెడ, దవడ, దంతాలు లేదా ఒక్కోసారి పొత్తికడుపు పై భాగం వరకు నొప్పి లేదా అసౌకర్యం వ్యాపించడం.
చల్లని చెమటలు: హఠాత్తుగా చల్లని చెమటలు పట్టడం.
అలసట: ఏమీ చేయకుండానే విపరీతమైన అలసట అనిపించడం.
ఛాతీలో మంట/జీర్ణ సమస్యలు: గుండెల్లో మంట లేదా అజీర్తిగా అనిపించడం.
మైకం: తల తిరుగుతున్నట్లు అనిపించడం.
వికారం: వాంతులు వస్తున్నట్లు అనిపించడం.
శ్వాస ఆడకపోవడం: ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది.
“ఈ ప్రారంభ లక్షణాలను గుర్తించి, వెంటనే వైద్య సహాయం తీసుకోవడం ప్రాణాలను కాపాడుతుంది. గుండెకు పెద్ద నష్టం జరగకుండా నిరోధించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది” అని డాక్టర్ గైక్వాడ్ నొక్కి చెప్పారు.
ఏమి చేయాలి?
గుండెపోటు లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ను సంప్రదించాలని, డాక్టర్ ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా పాటించాలని డాక్టర్ గైక్వాడ్ సలహా ఇచ్చారు. వీటితో పాటు:
ఆరోగ్యకరమైన ఆహారాన్ని మీ ఆహారంలో చేర్చుకోండి.
రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే ఆహారాలు తినండి.
మీ దైనందిన జీవితంలో తేలికపాటి వ్యాయామాన్ని చేర్చుకోండి.
డాక్టర్ సలహా మేరకు మీ ఆహారంలో మార్పులు చేసుకోండి.
ఢిల్లీలోని ఆకాష్ హెల్త్కేర్ నిర్వహించిన ఐదేళ్ల అధ్యయనం ప్రకారం, కోవిడ్-19 మహమ్మారి తర్వాత గుండెపోటు కేసులు రెట్టింపు అయ్యాయి. అత్యవసర కేసులు 60% పెరిగాయని అధ్యయనం వెల్లడించింది. 2020 నుంచి 2023 మధ్య భారతదేశంలోని ఆసుపత్రుల నుంచి సేకరించిన గుండెపోటు కేసుల డేటా ప్రకారం, గుండెపోటు వచ్చిన వారిలో 50% మంది 40 ఏళ్ల లోపు వారే ఉండటం ఆందోళన కలిగించే విషయం. నిశ్చల జీవనశైలి, ఒత్తిడి, సరైన ఆహారం లేకపోవడం, ధూమపానం, మద్యపానం మరియు జన్యుపరమైన కారకాలు ఈ పెరుగుదలకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
“శరీరం ఇచ్చే సంకేతాలను వినడం, గుండె పనితీరును నిర్ధారించడానికి ECG వంటి సకాలంలో స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ప్రస్తుత అవసరం” అని డాక్టర్ గైక్వాడ్ సూచించారు.




